రోబోలు తయారుచేసిన బ్రిడ్జి.. రిబ్బన్‌ కట్‌ చేసిన రాణి

20 Jul, 2021 19:52 IST|Sakshi
ఆమ్‌స్టర్‌డమ్‌లో బ్రిడ్జి ప్రారంభించి పరిశీలిస్తున్న రాణి మాక్సిమా

ఆమ్‌స్టర్‌డమ్‌: ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మాణ పనిలో రోబోలు పాల్గొన్నాయి. కార్మికులు లేకుండా ఈ యంత్రపు మనుషులు పని చేశాయి. రోబోలు తయారుచేసిన బ్రిడ్జిని ఎంచక్కా రాణి వచ్చేసి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ రోబోలు తయారుచేసిన బ్రిడ్జి ఎన్నో ప్రత్యేకతలతో ఉండి అందరినీ ఆకర్షిస్తోంది. ఆ బ్రిడ్జి ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్‌ వంతెన కావడం విశేషం. ఈ వంతెన నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టార్‌డమ్‌ నగరంలో నిర్మించారు. ఈ బ్రిడ్జి విశేషాలు మీరు తెలుసుకోండి.

ఆమ్‌స్టర్‌డమ్‌లోని ఓ పురాతన కాలువపై 4,500 కిలోల ఉక్కు (స్టీల్‌)తో బ్రిడ్జి తయారు చేశారు. ఈ బ్రిడ్జిని నెదర్లాండ్స్‌కు చెందిన ఎంఎక్స్‌ 3 డీ సంస్థ రూపొందించింది. 12 మీటర్ల పొడవైన ఈ వంతెనను 4 రోబోలు కలిసి తయారు చేశాయి. ఈ బ్రిడ్జిని ఒకచోట తయారు చేసి తీసుకొచ్చి పెట్టారు. ఆ తయారీలో రోబోలే పాల్గొన్నాయి. సుమారు 6 నెలల పాటు కష్టపడి బ్రిడ్జిని రోబోలు రూపొందించాయి. తయారైన బ్రిడ్జిని పడవ సహాయంతో కాలువ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం క్రేన్‌ సహాయంతో కాలువపై ఉంచారు. ఈ బ్రిడ్జి కాలువను దాటేందుకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ బ్రిడ్జికి ఎంఎక్స్‌ 3డీ అని పేరు పెట్టారు. 

ఈ బ్రిడ్జిని జూలై 15వ తేదీన డచ్‌ రాణి మాక్సిమా అట్టహాసంగా ప్రారంభించారు. 18వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆ బ్రిడ్జి రోడ్డు దాటడానికి కాకుండా పర్యాటక స్థలంగా మారింది. ఆ బ్రిడ్జి విశేషాలను తెలుసుకునేందుకు.. చూసేందుకు పెద్ద ఎత్తున డచ్‌ ప్రజలు వస్తున్నారు. అందమైన నగరానికి పర్యాటకంగా మరో అందం తీసుకొచ్చిందని ఆమ్‌స్టర్‌డమ్‌ నగర అధికారులు తెలిపారు.

వంతెన ప్రత్యేకతలు

  • 12 మీటర్ల పొడవు 
  • 4,500 కిలోల ఉక్కు వినియోగం.
  • డజనుకు పైగా సెన్సార్లు ఉన్నాయి.
  • వంతెనకు ఏమైనా ప్రమాదం.. లేదా దెబ్బతింటే వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం వస్తుంది.
  • ఈ వంతెనకు సంబంధించిన వివరాలన్నీ డేటా కంప్యూటర్‌లో నిక్షిప్తం.
  • ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జితో భవిష్యత్‌లో 3డీ పరిజ్ఞానంతో పెద్ద భవంతులు నిర్మించేందుకు కంపెనీలకు ఓ ఉదాహరణగా మారింది.
  • ఎంత బలన్నైయినా ఈ వంతెన మోస్తుంది.

ఆమ్‌స్టర్‌డమ్‌లోని కాలువపై నిర్మించిన త్రీడీ ప్రింటింగ్‌ స్టీల్‌ వంతెన

మరిన్ని వార్తలు