జపాన్‌ కుబేరుడి రోదసీ యాత్ర

9 Dec, 2021 04:39 IST|Sakshi

మాస్కో: జపాన్‌ బిలియనీర్, ఫ్యాషన్‌ వ్యాపా రాధిపతి యుసాకు మెజావా బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు పయనమయ్యారు. సొంత నిధులతో అంతరిక్ష యాత్ర చేపట్టిన యుసాకుతో పాటు ప్రముఖ నిర్మాత యోజో హిరానో ఉన్నారు. యుసాకు యాత్రను హిరానో డాక్యమెంటరీగా చిత్రీకరించనున్నా రు. రష్యాకు చెందిన సోయుజ్‌స్పేస్‌క్రాఫ్ట్‌లో రష్యా కాస్మొనాట్‌ అలెగ్జాండర్‌ మిస్రుకిన్‌తో కలిసి వీరిరువురు రోదసీలోకి వెళ్లారు.

కజకిస్తాన్‌లోని బైకనుర్‌ లాంచింగ్‌ స్టేషన్‌ నుంచి ఈ నౌక బయలుదేరింది. 12 రోజుల పాటు యుసాకు, హిరానో ఐఎస్‌ఎస్‌లో గడుపుతారు. 2009 తర్వాత స్వీయ నిధులతో ఒకరు రోదసీలోకి వెళ్లడం ఇదే ప్రథమం. యాత్రకు అయ్యే ఖర్చువివరాలు బహిర్గతం కాలేదు.

రోదసీ నుంచి భూమిని వీక్షించడాన్ని ఇష్టపడతానని, భార రహిత స్థితిని అనుభవించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని యాత్రకు ముందు యుసాకు చెప్పారు. జపాన్‌లోని అతిపెద్ద ఆన్‌లైన్‌ షాపింగ్‌ మాల్‌ జోజోటవున్‌కు యుసాకు అధిపతి. ఆయన ఆస్తుల మొత్తం సుమారు 200 కోట్ల డాలర్లని అంచనా. 2023లో ఎలాన్‌ మస్క్‌ నిర్వహించే చంద్రయాత్రలో కూడా యుసాకు పాలుపంచుకోనున్నారు.   

>
మరిన్ని వార్తలు