ఒపెక్ దేశాలకు జెలెన్స్కీ విజ్ఞప్తి
దోహా ఫోరాన్ని ఉద్దేశించి ప్రసంగం
దోహా/ఇస్తాంబుల్: ‘‘చమురు ఉత్పత్తిని మరింతగా పెంచండి. ఇంధనం కోసం రష్యాపై ఆధారపడకుండా యూరప్ దేశాలను ఆదుకోండి. వాటి భవితవ్యం మీ చేతుల్లోనే ఉంది’’ అని ఒపెక్ దేశాలకు, ముఖ్యంగా ఖతర్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఖతర్లో జరుగుతున్న దోహా ఫోరాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తమ దేశాన్ని రష్యా సర్వనాశనం చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మా రేవు పట్టణాలను నేలమట్టం చేసింది. దీంతో ఉక్రెయిన్ ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. ఇది ప్రపంచమంతటికీ పెద్ద దెబ్బే. మమ్మల్ని లొంగదీయలేక రష్యా అణు బెదిరింపులకు దిగుతోంది. అదే జరిగితే ప్రపంచమంతటికీ పెనుముప్పే’’ అని హెచ్చరించారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. జెలెన్స్కీతో ఆయన ఫోన్లో మాట్లాడారు.