జగిత్యాలజోన్ : విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ఏడాది జైలుతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ జిల్లా ఫాస్ట్ట్రాక్ కోర్టు జడ్జి, జిల్లా మొదటి అదనపు జడ్జి వీరయ్య సోమవారం తీర్పుచెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముదుగంటి బాలత్రిపుర సుందరి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని ఓ ప్రైవేట్ జూ నియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. డిసెంబర్ 12, 2016న కళాశాలలో పరీక్ష ఉండగా హాజరైంది. రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో అర్ముల్ల రాజేశ్ అనే వ్యక్తికి చెందిన ఆటో కనిపించగా తెలిసిన వ్యక్తి అని ఆటో ఎక్కింది. కొంతదూరం వెళ్లాక విద్యార్థిని పట్ల ఆటోడ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించగా ఆటోలో నుంచి దూకింది. దీంతో తీవ్రగాయాలుకాగా జగిత్యాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయడంతో ప్రస్తుత డీసీపీ, అప్పటి సీఐ పి. కరుణా కర్ రాజేశ్ను అరెస్ట్ చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు బి.రాజు, జి. మల్లేశ్, కిరణ్కుమార్ సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. రాజేశ్కు ఏడాది జైలుతో పాటు రూ.3వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.