అక్షర విషంపై జనాగ్రహం

24 Feb, 2023 23:42 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అనునిత్యం ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై.. ప్రతి అక్షరంతోనూ విషం చిమ్ముతున్న ఈనాడు పత్రిక తీరుపై జనాగ్రహం రెండో రోజూ కొనసాగింది. తప్పుడు రాతలకు ఇకనైనా స్వస్తి చెప్పాలంటూ ప్రజలు ఎక్కడికక్కడ ఆ పత్రిక ప్రతులను శుక్రవారం కూడా దహనం చేశారు. ‘రామోజీ డౌన్‌ డౌన్‌’ అంటూ పెద్ద పెట్టున నినదిస్తూ నిరసన ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు.

టీడీపీ నాయకుడు పట్టాభిని కొట్టారంటూ రెండేళ్ల కిందటి ఫొటోలు పెట్టి ప్రచురించిన ‘ఈనాడు’ కఽథనాలకు నిరసనగా ఆ పత్రిక ప్రతులను రోడ్లపై గుట్టలుగా పోసి నిప్పంటించారు. పలు ప్రాంతాల్లో రామోజీరావు దిష్టిబొమ్మను ఊరేగించి, చెప్పులతో కొట్టి, కాళ్లతో తన్నుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు తప్పుడు రాతలు సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో లోపలి పేజీల్లో సవరణలు వేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందో ఇప్పటికై నా గుర్తించాలని పలువురు ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలీసు స్టేషన్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ ఆధ్వర్యాన అమలాపురం – కాకినాడ 216 జాతీయ రహదారిపై ఈనాడు ప్రతులను దహనం చేశారు. రామోజీ డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ కమిడి ప్రవీణ్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెన్మత్స చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు.

పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యాన ఈనాడు పత్రిక ప్రతులను అయినవిల్లి మండలం పోతుకుర్రులో దహనం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపు మేరకు వైఎస్సార్‌ సీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించి, ఈనాడు ప్రతులను దహనం చేశారు. గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు మాట్లాడుతూ, నిజాన్ని దాచిపెట్టి టీడీపీ నేతలకు వంత పాడుతూ, పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న ఈనాడు అధినేత రామోజీరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కో ఆప్షన్‌ సభ్యుడు గండేపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం మున్సిపల్‌ సెంటర్‌లో కో ఆర్డినేటర్‌, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన నిరసన తెలిపారు. రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు బొడ్డు తులసీ మంగతాయారు, గంగిరెడ్డి అరుణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మి, కంటే వీరరాఘవరావు తదితరులు ఈనాడుకు, రామోజీరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈనాడు ప్రతులను దహనం చేశారు. తుని గొల్ల అప్పారావు సెంటర్‌లో మంత్రి దాడిశెట్టి రాజా పిలుపుతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈనాడు ప్రతులను దహనం చేశారు. తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలో కూడా ఈనాడు ప్రతులను దహనం చేసి, నిరసన తెలిపారు. కోటనందూరులో వైఎస్సార్‌ సీపీ నాయకులు నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించి, ఈనాడు ప్రతులు దహనం చేశారు.

మరిన్ని వార్తలు