సామర్లకోట: గ్రామాల్లో సుస్థిర లక్ష్యాల సాధనపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం (ఈటీసీ) ప్రిన్సిపాల్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ జె.వేణుగోపాల్ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఎంపీడీఓ, ఈఓ పీఆర్డీ, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజుల టీఓటీ శిక్షణను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని బాపట్ల, శ్రీకాళహస్తి, సామర్లకోటల్లో ఉన్న ఈటీసీల ద్వారా అన్ని జిల్లాల్లోనూ టీఓటీలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పేదరికం లేని గ్రామం, జీవనోపాధులు, ఆరోగ్యవంతమైన గ్రామం, పిల్లలు వారి సామర్థ్యం చేరుకోవడానికి మనుగడ, అభివృద్ధి, భాగస్వామ్యం, నీటి సమృద్ధి ఉన్న గ్రామం, పరిశుభ్ర హరిత గ్రామం, స్వయం సమృద్ధి ఉన్న మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామం, సామాజికంగా సురక్షితమైన గ్రామం, సుపరిపాలన కలిగిన గ్రామం అనే అంశాలపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ) డైరెక్టర్ మధుసూదన్(హైదరాబాద్), ఫ్యాకల్టీలు శ్రీదేవి, లలిత, శ్రీనివాస్, కేజియా, సుబ్బారావు, పి.శ్రీనివా సు, నిహరిక, ఎంఎస్ఎన్ రెడ్డి శిక్షణ ఇచ్చారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారు రెండు రోజుల పాటు నేర్చుకున్న అంశాలతో ఆయా జిల్లాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని ఎన్ఐఆర్డీ డైరెక్టర్ మధుసూధన్ తెలిపారు.