-

3,421 మందికి గౌరవ వేతనం

22 Mar, 2023 01:12 IST|Sakshi
జాన్‌వెస్లీని సత్కరిస్తున్న మండల పాస్టర్లు

జగ్గంపేట: రాష్ట్రంలో రెండో విడతగా 3,421 మంది పాస్టర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం మంజూరు చేసిందని రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లవరపు జాన్‌వెస్లీ తెలిపారు. యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆఫ్‌ జగ్గంపేట ఆధ్వర్యాన మంగళవారం జగ్గంపేటలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలకు, పార్టీలకు అతీతంగా నవరత్న పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. నవరత్నాల వల్ల రాష్ట్రంలోని లక్షా 25 వేల మంది క్రైస్తవులకు రూ.250 కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు. అర్హులైన వారికి జెరూసలెం యాత్రకు అనుమతిస్తున్నారని తెలిపారు. దీని కోసం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి రూ.60 వేలు, ఎగువన ఉన్నవారికి రూ.30 వేలు మంజూరు చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే 3 బృందాలు జెరూసలెం యాత్రలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో క్రైస్తవుల బరియల్‌ గ్రౌండ్‌ సమస్యకు ముఖ్యమంత్రి త్వరలోనే పరిష్కారం చూపనున్నారని చెప్పారు. జగ్గంపేటలో క్రిస్టియిన్‌ కమ్యూనిటీ హాలుకు రూ.50 లక్షలు మంజూరు చేశామని, పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. ఈ హాలును ఆయన పరిశీలించారు. జాన్‌ వెస్లీని పాస్టర్స్‌ ఫెలోషిప్‌ మండల అధ్యక్షుడు, మండల కో ఆప్షన్‌ సభ్యుడు కె.జాన్‌వెస్లీ ఆధ్వర్యాన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానమంత్రి పదిహేను సూత్రాల క్రిస్టియన్‌ మైనారిటీ రిప్రజెంటేటివ్‌ ఎస్‌.జార్జీబాబు, వైఎస్సార్‌ సీపీ క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దడాల జాషువ, నియోజకవర్గ సెల్‌ ఇన్‌చార్జి నొక్కు విజయరాజు, జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిఫ్‌ జాయింట్‌ సెక్రటరీ ఐ.సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు