తొండంగి: కొత్త అమావాస్య పండగ సందర్భంగా మండలంలో శృంగవృక్షంలో మంగళవారం రాత్రి పెద్దింట్లవ్ము, నూకాలమ్మ జాతరలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తొండంగికి చెందిన నడిపల్లి రాము(22) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో రెండు రోజులుగా గ్రామదేవతల జాతర ఉత్సవం జరుగుతోంది. తొండంగికి చెందిన యువకుడు నడిపల్లి రాము శృంగవృక్షంలో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. గ్రామంలో జాతర జరుగుతుండటంతో వెళ్లాడు. జాతరలో సిద్దాంతపు రవి, అడపా సాయిభాస్కర్ల కాళ్లు తొక్కాడన్న సంఘటనపై వివాదం తలెత్తింది. ఇది రెండు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. ఒక వర్గం దాడితో నడిపల్లి రాముతోపాటు నక్కా నాగేశ్వరరావు, నక్కా ఇస్సాక్, పులుగు గంగబాబు, సిద్దాంతపు రవి, దడాల పెద అప్పలకొండ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వైద్యం నిమిత్తం తొండంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాము మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మిగిలినవారంతా తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ రవీంద్రనాఽథ్బాబు ఆదేశాల మేరకు శృంగవృక్షంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మృతుని తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 13 మందిపై కేసు నమోదు చేశామని తొండంగి ఎస్సై ఎస్.రవికుమార్ తెలిపారు. కాగా మృతుడి వర్గీయులు గ్రామంలో రోడ్డుపై బైఠాయించి, దాడికి కారకులైనవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తుని రూరల్ సీఐ సన్యాసిరావు నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఎస్పీ రవీంద్రబాబు పర్యటన
ఎస్పీ రవీంద్రనాఽథ్బాబు బుధవారం తుని ఏరియా ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుని అండగా ఉంటామని ఽధైర్యం చెప్పారు. కలెక్టర్ కృతికాశుక్లాతో చర్చించి, మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేకాధికారిగా ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ, బి.అప్పారావును నియమించామని పర్యవేక్షణాధికారిగా జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) పి.శ్రీనివాస్ను నియమించినట్టు తెలిపారు. ఎస్పీ, ఇతర అధికారుల బృందం శృంగవృక్షంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు.