సినిమా రేంజ్‌ క్రైమ్‌ స్టోరీ.. భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. ఆ తర్వాత..

20 Mar, 2023 05:53 IST|Sakshi
నిందితులు భాగ్యశ్రీ, సుపుత్ర శంకరప్ప

బనశంకరి(కర్ణాటక): దారితప్పిన ఓ మహిళ తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియునితో కలిసి ఏకంగా సొంత తమ్మున్నే హతమార్చింది. తరువాత ఇద్దరూ ఇతర రాష్ట్రానికి వెళ్లిపోయి జీవించసాగారు. కానీ చట్టం చేతుల నుంచి తప్పించుకోలేకపోయారు. సినిమా కథను పోలిన నేరంలో ఎన్నో ఏళ్ల తరువాత నిందితులు దొరికిపోయారు. 8 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో జిగణి పోలీసులు పరారీలో ఉన్న జంటను శనివారం అరెస్ట్‌ చేశారు. నిందితులు విజయపురవాసులు భాగ్యశ్రీ , సుపుత్ర శంకరప్ప తళవార.

అడ్డుచెప్పాడని హత్య చేసి..
వీరిద్దరూ బెంగళూరు జిగణి పారిశ్రామికవాడలో ప్రైవేటు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ వడేరమంచనహళ్లిలో అద్దె ఇంట్లో సహ జీవనం చేస్తున్నారు. భాగ్యశ్రీ గతంలోనే భర్త నుంచి విడిపోయి నగరానికి వచ్చింది, తరువాత మాజీ ప్రియుడు సుపుత్రతో కాపురం పెట్టింది. ఈ విషయం భాగ్యశ్రీ సోదరుడు లింగరాజ్‌ పూజారికి తెలిసింది. సోదరి ప్రవర్తనను వ్యతిరేకిస్తూ అతడు గొడవ పడ్డాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తమ్ముడు లింగరాజ్‌ ను హత్యచేయడానికి భాగ్యశ్రీ, ప్రియుడు సుపుత్రతో కలిసి కుట్ర పన్నింది. 2015 ఆగస్టు 11వ తేదీన ఇద్దరు కలిసి లింగరాజ్‌ ను హత్యచేశారు. మృతదేహాన్ని ముక్కలు చేసి వాటిని ప్లాస్టిక్‌ సంచిలో నింపుకుని వేర్వేరు స్దలాల్లో పడేసి మహారాష్ట్రకు వెళ్లి నాసిక్‌లో మకాం వేశారు. అక్కడ ఇద్దరూ పేర్లు మార్చుకుని జీవించసాగారు.

విచారణ సాగిందిలా
జిగణి సమీపంలోని వి ఇన్‌ హోటల్‌ వద్ద బ్యాగులో లింగరాజు కాళ్లు, చేతులు లభించాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 ఏళ్ల నుంచి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. హత్య చేసింది భాగ్యశ్రీ, సుపుత్రలు అని గుర్తించారు. వారి ఫోటోలను, వేలిముద్రలు తదితరాలను సేకరించి అన్ని పోలీస్‌ స్టేషన్లకు, ఇతర రాష్ట్రాలకు పంపారు. ఈ నేపథ్యంలో నాసిక్‌లో తలదాచుకున్నట్లు తెలిసి అరెస్టు చేసి బెంగళూరుకు తరలించారు.

మరిన్ని వార్తలు