కంప్లి: కురుగోడులో జరగనున్న యువచైతన్య కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లు, ప్లెక్సీలను మంగళవారం తహసీల్దార్ నేతృత్వంలో అధికారులు తొలగించారు. దీంతో అధికారులు, పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ ఇంటింటికీ గ్యారెంటీ కార్డులను, బ్యానర్లను అంటించి ఆశ చూపిన కాంగ్రెస్ వారిపై కూడా తహసీల్దార్ చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై తహసీల్దార్ ఎం.గురురాజ్ మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపుల బ్యానర్లు కట్టేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. జిల్లాధికారి కార్యాలయ ఆదేశాల మేరకు తొలగింపు కార్యాచరణ చేపట్టామన్నారు. కాగా ఎస్ఐ సణ్ణవీరేష్ రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.