ఆన్‌లైన్ క్లాసుల కోసం మంగ‌ళ‌సూత్రం తాక‌ట్టు

1 Aug, 2020 18:46 IST|Sakshi

బెంగళూరు: కరోనా దెబ్బకు స్కూళ్లు బంద్.. దీంతో పిల్లల చదువాగిపోయింది.. దూరదర్శన్‌ చానల్‌లో ప్రసారమయ్యే పాఠాలే ప్రస్తుతం ఆ పిల్లలకు దిక్కు. కానీ ఇంట్లో టీవీలేదు. ఇరుగు పొరుగు వారిళ్లలోనే ప్రస్తుతం ఆ చిన్నారులు టీవీ చూస్తున్నారు. మరోవైపు.. టీవీ పాఠాలు తప్పనిసరి అని టీచర్లు తల్లికి తేల్చి చెప్పారు. అప్పు చేద్దామనుకుంటే.. ఎవరూ సహాయం చేయలేదు..ఈ నేపథ్యంలో తన పిల్లల ఆన్‌లైన్‌ క్లాసులు మిస్స‌వ్వ‌కూడ‌ద‌ని భావించింది.  టీవీ కొనేందుకు డబ్బులు లేక తన మంగళసూత్రం తాకట్టు పెట్టింది. ఆ ఘ‌ట‌న‌ కర్నాటకలోని గదగ్‌ జిల్లా నగ్నూరు గ్రామంలో చోటుచేసుకుంది.(క‌రోనా భ‌యం.. వాషింగ్ మెషిన్‌లో క‌రెన్సీ నోట్లు)

గ్రామానికి చెందిన కస్తూరి చల్వాది అనే మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మునియప్ప.. రోజూవారి కూలీలు.. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు దూర్‌‌దర్శన్‌లో పాఠాలు వినేందుకు ఇంట్లో టీవీ లేకపోవడంతో ఆమె తన 12 గ్రాముల మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో టీవీ కొన్నారు. అయితే ఈ విషయం  గ్రామ‌స్తుల‌కు తెలియడంతో వారికి తోచినంత సాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. విష‌యం తెల‌సుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ రూ. 50 వేలు, రాష్ట్రానికి చెందిన మరో మంత్రి రూ. 20 వేల చొప్పున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

ఇదే విష‌య‌మై క‌స్తూరి స్పందిస్తూ... 'పిల్లలకు దూర్‌‌దర్శన్‌లో పాఠాలు చెప్తున్నారు. మాకు టీవీ లేదు. టీచర్లు పాఠాలను దూర్‌‌దర్శన్‌లో వినాలని చెప్పారు. వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీవీ కొనేందుకు నిశ్చయించాను. లాక్‌డౌన్‌ వల్ల రోజూవారి కూలీకి వెళ్ల‌డం లేదు. అప్పు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇక చేసేది లేక మంగళసూత్రం తాకట్టు పెట్టాను.' అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు