పెళ్లిపై గొడవ: అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య, తల్లి గల్లంతు

30 Jan, 2021 09:52 IST|Sakshi

యశవంతపుర: పెళ్లి సంబంధాలు విషయమై కుటుంబంలో గొడవలకు దారి తీశాయి. దీనిపై తరచూ వాగ్వాదం జరుగుతుండడంతో మనస్తాపం చెందిన తల్లీకూతుళ్లు కాలువలోకి దూకగా.. అది చూసిన సోదరుడు కూడా కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా తల్లి ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ విషాద ఘటన కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లా సంతేబెన్నూరు తాలూకా చెన్నగిరి సమీపంలోని మరవంజి గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రాజప్ప కుమార్తె శ్రుతి (24) ఎంఏ పూర్తి చేసింది. ఆమెకు అనేక పెళ్లి సంబంధాలను చూశారు. తండ్రి ఏ సంబంధం తీసుకొచ్చినా యువతి ఒప్పుకునేది కాదు. ఇదే విషయమై కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శ్రుతి, ఆమె తల్లి కమలమ్మ (50) బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ రాలేదు. వారు అదృశ్యమవడంతో రాజప్ప, ఆయన కుమారుడు సంజయ్‌ గాలింపు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంతేబెన్నూరు సమీపంలోని మెదికెరె వద్ద భద్ర కాలువలో గురువారం శృతి మృతదేహం లభ్యమైంది. అయితే సోదరి మృతితో మనస్తాపం చెందిన సంజయ్‌ కూడా కాలువలోకి దూకగా శుక్రవారం అతడి మృతదేహం యక్కెగొంది వద్ద లభించింది. అయితే కమలమ్మ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు