Si Exam Scam: ఎంట్రన్స్‌ టెస్టులో అవకతవకలు.. మరిన్ని ట్విస్టులు

2 May, 2022 07:42 IST|Sakshi

బనశంకరి: ఎస్‌ఐ పోస్టుల రాత పరీక్ష కుంభకోణంలో రోజురోజుకూ కొత్త ముఖాలు వెలుగు చూస్తున్నాయి. బెంగళూరులోనూ 7 పరీక్ష కేంద్రాల్లో కొందరు అక్రమాలకు పాల్పడి ఉత్తీర్ణులైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి హైగ్రౌండ్‌ పోలీసులు 12 మందిని అరెస్టు చేయగా వారిలో ఒక ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఉన్నట్లు సమాచారం. ఇతడు పది లోపు ర్యాంకులో ఉత్తీర్ణుడు కావడం గమనార్హం. ఓఎంఆర్‌ షీట్, కార్బన్‌ షీటులో వ్యత్యాసం బయటపడింది. మరో 10 మంది అభ్యర్థుల కోసం గాలింపు జరుగుతోంది.  

ఇంజనీర్‌ లొంగుబాటు  
ఈ స్కాంలో 20 రోజులుగా పరారీలో ఉన్న మరో కింగ్‌పిన్‌ నీటిపారుదల శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ మంజునాథ మేళకుంద ఆదివారం కలబురిగి నగరంలో సీఐడీ ఆఫీసుకు ఆటోలో వచ్చి లొంగిపోయాడు.  ఈ బాగోతంలో తన పాత్ర లేదని, ఆరోగ్యం సరిగా లేకపోవడంలో మంగళూరులో ఉన్నట్లు మీడియాతో చెప్పాడు. తన పేరు అనవసరంగా వెలుగులోకి వచ్చిందన్నారు. మంజునాథ తమ్ముడు రవీంద్ర, ప్రధానోపాధ్యాయుడు కాశీనాథ్, అభ్యర్థి శాంతాబాబు ఇంకా పరారీలో ఉండగా, 10 బృందాలతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలిస్తున్నారు.  

మరికొందరి కుమ్మక్కు  
మరో ముఖ్య నిందితురాలు దివ్య హాగరగిని సీఐడీ అధికారులు రెండు రోజుల నుంచి ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. కింగ్‌పిన్‌ రుద్రేగౌడపాటిల్, మంజునాథ మేళకుందతో కలిసి బ్లూటూత్‌ ఉపకరణాలను ఉపయోగించి సమాధానాలు చెప్పడానికి గాను లక్షలాది రూపాయలు డీల్‌ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. దివ్య హాగరగి సహకారంతో, కలబురిగి జ్ఞానజ్యోతి పాఠశాల హెచ్‌ఎం కాశీనాథ్‌తో కలిసి ప్లాన్‌ చేశారు. రుద్రేగౌడ పాటిల్‌తో పాటు కొందరు పోలీస్‌ అధికారులు, కానిస్టేబుళ్లు కుమ్మక్కైనట్లు అనుమానాలున్నాయి. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, ఒక సీఐ, కొందరు కానిస్టేబుల్స్‌ పేర్లు వినబడుతున్నాయి.ఏయే అభ్యర్థులకు సహాయం చేయాలి అనే దానిపై పోలీస్‌ అధికారులే రుద్రేగౌడకు సూచనలిచ్చారు. పరీక్ష పూర్తయిన తరువాత కానిస్టేబుల్స్‌ ద్వారా అభ్యర్థులు డబ్బులు అందజేశారు. ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది రుద్రేగౌడ నిర్ణయించాడు. 

ఇది కూడా చదవండి: చైనాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చిన భారత్‌

మరిన్ని వార్తలు