భవానీపురం(విజయవాడపశ్చిమ): జ్వరాల నియంత్రణకు డ్రైడే పాటించడం తప్పనిసరి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు (డీహెచ్) డాక్టర్ వి.రామిరెడ్డి అన్నారు. మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ డెంగీ కేసులు అక్కడక్కడా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. వాటి నియంత్రణకు తప్పనిసరిగా డ్రైడే పాటించా లని ఆదేశించారు. గొల్లపూడి సచివాలయం–4 పరిధిలోని నిర్వహిస్తున్న డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో డీహెచ్ డాక్టర్ రామిరెడ్డి ఆయన పాల్గొని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క శుక్రవారమే కాకుండా మిగిలిన రోజుల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య విద్య కార్యక్రమాలు నిర్వహించా లని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను నిర్మూలించాలని, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, వినియోగించిన ప్లాస్టిక్ గ్లాసులు, కూలర్లు, ఫ్లవర్ వాజ్లతో నీటి నిల్వలు లేకుండా పొడిగా ఉంచుకోవాలని సూచించారు. ఏఎన్ఎంలు రోజూ వెక్టార్ హైజీన్ యాప్లో ఇష్యూలు పెట్టాలని, వాటిని పరిష్కరించడం ద్వారా పరిసరాల పరి శుభ్రత, దోమలు నియంత్రణ జరిగి జ్వరాలు అదుపులో ఉంటాయన్నారు. జాతీయ కీటకజనిత వ్యాధులు నియంత్రణ కార్యక్రమం రాష్ట్ర సమన్వయకర్త శ్రీకాంత్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతిబాబు, కొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఆర్.పద్మావతి, ఏఎంఓ సూర్యకుమార్, మలేరియా సబ్ యూనిట్ అధికారి బి.జి.అప్పారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ జి.శ్రీరంగం, బయాలజిస్ట్ సూర్యకుమార్, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.