కొంతకాలంగా దూరం.. వేరొకరి బైక్‌పై వెళ్లిన ప్రియురాలు.. తట్టుకోలేక

21 Mar, 2023 01:26 IST|Sakshi

గుడివాడరూరల్‌: ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుడివాడ పట్టణంలోని మార్వాడీ సెంటర్‌కు చెందిన శైలేష్‌సింగ్‌ (26) తన తండ్రి వావర్‌సింగ్‌ గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా నిర్వహిస్తున్న టీస్టాల్‌లో తండ్రికి సహాయంగా పని చేస్తున్నాడు. తమ ప్రాంతంలోని ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.

కొంత కాలంగా ఆమె శైలేష్‌సింగ్‌ను దూరంపెడుతోంది. ఇటీవల ఆ యువతి వేరే యువకుడి బైక్‌పై వెళ్తూ కనిపించింది. దీంతో మనస్తాపానికి గురైన శైలేష్‌సింగ్‌ ఆదివారం రాత్రి యువతి ఇంటికి వెళ్లి తనతో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలు ఆర్పారు. అప్పటికే యువకుడికి శరీరంపై 80 శాతం మేర తీవ్ర గాయాలయ్యాయి.

అతడిని 108 అంబులెన్స్‌ సిబ్బంది గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శైలేష్‌సింగ్‌ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి వావర్‌సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు