ప్లాట్‌ఫారం టికెట్‌ రూ.50.. రద్దీని తగ్గించేందుకే

3 Mar, 2021 04:14 IST|Sakshi

ముంబై సెంట్రల్‌: ప్లాట్‌ఫారం టికెట్‌ ధరను రైల్వే ఏకంగా రూ.50కి పెంచేసింది. ఒకవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న ధరలతో ఇప్పటికే ముంబైకర్లు సతమతమవుతుంటే ప్రభుత్వం పెంచిన ప్లాట్‌ఫారం టికెట్ల ధరలు వారికి అశనిపాతంగా మారాయి. గత కొద్ది రోజులుగా ముంబై పరిసర నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్టా, ప్రభుత్వం అనవసరమైన అధిక రద్దీని తగ్గించేందుకు తగిన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే రైల్వే స్టేషన్స్‌లో ప్రయాణీకులతో పాటు అనవసరంగా జనం గుంపు కడుతున్నారనీ, జనాల రద్ధీని తగ్గించేందుకు ప్లాట్‌ఫారం టికెట్ల ధరలు అమాంతం పెంచేసి యాభై రూపాయలు చేసింది.

గతంలో ఈ ప్లాట్‌ఫారం టికెట్‌ ధర పది రూపాయలు ఉండేది. నిజానికి ధరలు పెంచాలనే నిర్ణయం 24 ఫిబ్రవరి రోజే తీసుకున్నామనీ, ఈ పెంచిన ధరలు జూన్‌ 15 వరకు అమలులో ఉంటాయని మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి శివాజీ సుతార్‌ తెలిపారు. ముంబై మహానగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్, దాదర్, లోకమాన్య తిలక్‌ టెర్మినస్, థానే, కల్యాణ్, పన్వేల్, భివండీ రోడ్‌ స్టేషన్‌లలో ప్లాట్‌ ఫారం టికెట్ల ధరలు యాభై రూపాయలు ఉంటాయనీ, ఇవే స్టేషన్‌లలో రద్దీని తగ్గించేందుకు రేట్లను పెంచామనీ ఆయన అన్నారు.  చదవండి: (మరోసారి కరోనా విజృంభణ.. 14 వరకు కర్ఫ్యూ)

మరిన్ని వార్తలు