సరుకులు కొనడానికి వెళ్లి..

9 Jul, 2021 14:03 IST|Sakshi
సతీష్‌ కుమార్‌ (ఫైల్‌) వేణు గోపాల్‌ రాజు(ఫైల్‌)

టిప్పర్‌ ఢీకొనడంతో ఇద్దరు యువకుల దుర్మరణం

పటాన్‌చెరుటౌన్‌: ఇంటి సరుకులు కొనుగోలు చేయడానికి బైక్‌పై వెళ్లిన ఇద్దరు యువకులను టిప్పర్‌ ఢీకొట్టడంతో మృతి చెందారు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకొంది. ఘటనకు సంబంధించి ఎస్సై రామానాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం దేవర్ల లంక గ్రామానికి చెందిన సతీష్‌ కుమార్‌(28) బతుకు దెరువు కోసం వచ్చి ఇస్నాపూర్‌ హనుమాన్‌ నగర్‌ కాలనీలో భార్యతో కలసి నివాసం ఉంటూ పాశంమైలారం పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఫిట్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం సతీష్‌కుమార్, అతడి స్నేహితుడు ఖమ్మం జిల్లా నుంచి బతుకుదేరువు కోసం వచ్చిన ఇస్నాపూర్‌లో ఉంటున్న వేణు గోపాల్‌ రాజు(27)తో కలసి బైక్‌పై డిమార్ట్‌లో సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. సరుకులు కొనుగోలు చేసుకొని తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా ఇస్నాపూర్‌ ఎస్‌బీఐ వద్ద బైకును యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో పటాన్‌చెరు వైపు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న టిప్పర్‌ అతివేగంగా బైక్‌ను ఢీకొంది. అనంతరం టిప్పర్‌ వారి మీదగా వెళ్లింది. దీంతో తీవ్రగాయాలైన ఇద్దరిని స్థానికులు చికిత్స కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు సతీష్‌ కుమార్‌ భార్య హేమసాయి ప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు