ఆగస్టు 12న ‘1948 - అఖండ భారత్’

5 Aug, 2022 14:42 IST|Sakshi

మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి గల కారణం ఏంటి? హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘1948 - అఖండ భారత్’. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  ఆలేఖ్య శెట్టి, రఘనందన్, ఆర్యవర్ధన్ రాజ్, ఇంతియాజ్  తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత ఎమ్.వై.మహర్షి, దర్శకుడు ఈశ్వర్ డి.బాబు, రచయిత మరియు గాడ్సే పాత్రధారి డా. ఆర్యవర్ధన్ రాజు, సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ పాల్గొన్నారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి... బాలకృష్ణ నటించగా అద్భుత విజయం సాధించిన ‘అఖండ’ తరహాలో విజయం సాధించే చిత్రంగా ‘1948 - అఖండ భారతి’చిత్రాన్ని అభివర్ణించారు.

డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ... "గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. వాటిని తమ చిత్రంలో చూపించబోతున్నామని చెప్పారు. 

మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి... హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం' అన్నారు!

చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి.బాబు మాట్లాడుతూ...11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి... 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్,  500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో...  ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం" అన్నారు

ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉందని... దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్... ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే... ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు