మీ ప్రార్థనలతోనే ఇది సాధ్యమైంది: అభిషేక్‌

8 Aug, 2020 15:35 IST|Sakshi

ముంబై: ఇటీవల కరోనా బారిన పడిని బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ మహమ్మారిని జయించాడు. గత కొంతకాలంగా కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయన‌ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ వచ్చిందని తాను హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు అభిషేక్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ప్రామిస్‌‌ ఈజ్‌ ఏ ప్రామిస్‌! ఈ రోజు మధ్యాహ్నం చేసిన కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్‌ వచ్చింది. నేను కరోనాను జయిస్తానని  చెప్పినట్టుగానే జయించాను. ఇది మీ ప్రార్థనలతోనే సాధ్యమైంది’ అంటూ రాసుకొచ్చారు. (చదవండి: నేను ఇంకా ఆస్పత్రిలోనే: అభిషేక్‌)

‘‘నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికి ధన్యవాదాలు. అంతేగాక నానావతి ఆస్పత్రి డాక్టర్‌లకు, నర్సులకు నా ప్రత్యేక ధన్యవాదాలు’’ అంటూ  అభిషేక్‌ ట్వీట్‌ చేశారు. అభిషేక్‌, అమితాబ్‌లు ఒకేసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరి అనంతరం అభిషేక్‌ భార్య, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్, కూతురు ఆరాధ్యకు కూడా కరోనా సోకింది. మొదట ఐశ్వర్య‌, ఆరాధ్య ఆ తర్వాత బిగ్‌బీ కూడా కోలుకొని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. (చదవండి: సరిదిద్దుకున్నా.. నన్ను క్షమించండి: బిగ్‌బీ)

మరిన్ని వార్తలు