సాయం చేద్దాం అంటూ హీరోయిన్ల పిలుపు

2 May, 2021 05:33 IST|Sakshi

దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు అందర్నీ కలవరపెడుతున్నాయి. ఈ క్లిష్టతర పరిస్థితుల్లో ఒకరికి ఒకరం సాయం చేసుకుంటూ ముందుకు అడుగులు వేయాలని అంటున్నారు హీరోయిన్‌ శ్రుతీహాసన్, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రజ్ఞా జైస్వాల్‌. ఈ అందాల తారలు తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో  షేర్‌ చేశారు.

దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న కరోనా పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది.  మన వంతు సాయం చేద్దాం. ఆ సాయం కోవిడ్‌ ఆసుపత్రుల గురించిన సమాచారం కావచ్చు, ప్లాస్మా దాతల వివరాలు కావచ్చు... ఇలా కోవిడ్‌ బాధితులకు ఉపయోగపడే విధంగా తప్పకుండా సాయం చేద్దాం. మనుషులకు మనుషులే సహాయం చేసుకోవాలి.
–ప్రగ్యా జైస్వాల్‌

దేశంలో కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులను గమనిస్తుంటే నా మనసు కలత చెందుతోంది. మళ్లీ మునుపటిలా సానుకూలమైన పరిస్థితులు వస్తాయనే ఆశతో ప్రతిరోజూ నిద్రలేస్తున్నాను. కానీ నిరాశే ఎదురవుతోంది. ఈ కష్టకాలాన్ని సమూలంగా పోగొట్టలేని నా నిస్సహాయత నన్ను బాధిస్తోంది. దేశంలో కరోనా పరిస్థితులు సద్దుమణగాలనీ, కోవిడ్‌ బాధితులందరూ త్వరగా కోలుకోవాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా కేసుల సంఖ్య పెరగకుండా మనం చేయగలిగింది చేద్దాం. ఎవరికి తోచిన రీతిలో వాళ్లం సాయం చేద్దాం. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి. మాస్కులు ధరించండి .
– రకుల్‌ప్రీత్‌సింగ్‌

నాకు తెలిసినవారిలో చాలామందికి కరోనా సోకింది. వారిలో కొంతమంది మృతి చెందారు కూడా! ఇది నన్ను తీవ్రంగా వేధిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులను చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. కోవిడ్‌ బాధితులు కోలుకొని, బయటపడాలని కోరుకుంటున్నాను, కరోనా అనేది పూర్తిగా మాయమై, మనందరం సంతోషంగా ఉండే రోజులు రావాలి. దయచేసి మాస్కులు ధరించండి. నిర్లక్ష్యంగా ఉండకండి. మన పరిధిలో సాయం చేసేందుకు ఏ చిన్న అవకాశం ఉన్నా, వెంటనే చేద్దాం.
– శ్రుతీహాసన్‌
 

మరిన్ని వార్తలు