గుండెపోటుతో యాక్ష‌న్ డైరెక్ట‌ర్ మృతి

27 Jul, 2020 19:56 IST|Sakshi

ముంబై: 'అంధాధున్‌' యాక్ష‌న్ డైరెక్ట‌ర్ ప‌ర్వీజ్ ఖాన్(55) గుండెపోటుతో మ‌ర‌ణించారు. సోమ‌వారం ఉద‌యం గుండెపోటు రావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టికీ కాసేప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. అయితే ప‌ర్వీజ్‌కు ఇంత‌కు ముందు ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేవని ఆయ‌న దీర్ఘ‌కాల‌ అసిస్టెంట్‌ నిశాంత్ ఖాన్ పేర్కొన్నారు. సాయంత్రం ముంబైలోని కందివ‌లిలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ఆయ‌నకు భార్య‌, కొడుకు, కోడ‌లు, మ‌నుమ‌రాలు ఉన్నారు. ప‌ర్వీజ్ మ‌ర‌ణం ప‌ట్ల ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. (యాప్‌తో ఉద్యోగం)

"షాహిద్ సినిమాలో ప‌ర్వీజ్ ఖాన్‌తో క‌లిసి ప‌ని చేశాను. అల్ల‌ర్ల సీన్‌ను కూడా సింగిల్ టేక్‌లో తీశారు. ఆయ‌న ప్ర‌తిభావంతుడు, ఎంతో మంచి మ‌నిషి. ఆయ‌న మాట‌లు నా చెవిలో ఇంకా ప్ర‌తిధ్వ‌నిస్తున్నాయి" అని హ‌న్స‌ల్ ట్వీట్ చేశారు. ప‌ర్వీజ్ ఖాన్ 1986 నుంచి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లందిస్తున్నారు. అక్ష‌య్ కుమార్‌ 'ఖిలాడీ', షారుక్ ఖాన్ 'బాజీఘ‌ర్'‌, బాబీ డియోల్‌ 'సోల్జ‌ర్' సినిమాల‌కు అసిస్టెంట్‌ యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. రామ్ గోపాల్ వ‌ర్మ నిర్మించిన 'అబ్ త‌క్ ఛ‌ప్పాన్' సినిమా ఆయ‌న‌కు మంచి బ్రేక్‌నిచ్చింది. ఆ త‌ర్వాత 'బుల్లెట్ రాజా'తోపాటు ద‌ర్శ‌కుడు శ్రీరామ్ రాఘ‌వ‌న్‌తో క‌లిసి 'జానీ గ‌ద్ద‌ర్'‌, 'ఏజెంట్ వినోద్'‌, 'బ‌ద్లాపూర్', 'అంధాధున్' సినిమాల‌కు ప‌ని చేశారు. (నటి వనితతో గొడవ, ఆ మహిళ ఎక్కడ?)

మరిన్ని వార్తలు