సీఎం స్టాలిన్‌తో నటుడు అర్జున్‌ భేటీ

30 Jun, 2021 06:37 IST|Sakshi

ముఖ్యమంత్రి స్టాలిన్‌ను నటుడు అర్జున్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. స్టాలిన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెబుతున్న విషయం తెలిసిందే. అదేక్రమంలో కరోనా కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు అర్జున్‌ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.

అయితే తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు అర్జున్‌ పేర్కొన్నారు. అలాగే ఇక్కడ మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. నటుడు అర్జున్‌ చెన్నై కెరుగంబాక్కంలోని తన తోటలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ ఆలయ కుంభాభిషేకం కార్యక్రమాన్ని గతంలో నిర్వహించతలపెట్టారు. అయితే కరోనా కారణంగా ఆ ఉత్సవం వాయిదా పడుతూ వచ్చింది. కాగా జులై 1, 2వ తేదీల్లో ఆంజనేయస్వామి దేవాలయ కుంభాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఉత్సవానికి ఆహ్వానించడానికే నటుడు అర్జున్‌ ఆయన్ని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే శ్రీఆంజనేయ ఆలయ కుంభాభి  షేకానికి ప్రజలను భారీఎత్తున ఆహ్వానించాలని భావించినా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అయితే భక్తులకు ఆ కొరత లేకుండా కుంభాభిషేక కార్యక్రమాన్ని యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని నటుడు అర్జున్‌ వెల్లడించారు.  

చదవండి: తమిళనాడు నూతన డీజీపీగా శైలేంద్రబాబు 

మరిన్ని వార్తలు