దీన స్థితి: ప్రముఖ నటుడు మృతి

24 Nov, 2020 13:27 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ రాయ్(55) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘ఉదయం 3.45 నిమిషాల ప్రాంతంలో ఆయన కుప్పకూలిపోయారు. గత కొన్ని నెలలుగా డయాలసిస్‌ జరుగుతోంది. ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడింది అనుకునేలోపే ఇలా జరిగిపోయింది. ఆయన సోదరి కోల్‌కతా నుంచి సాయంత్రం ఇక్కడికి వస్తారు. అప్పుడే అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతాయి’’ అని పేర్కొన్నారు. కాగా సినీ, టీవీ ఆర్టిస్టు అసోసియేషన్‌(సింటా) ఆశిష్‌ రాయ్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేసింది. ఫిల్మ్‌ మేకర్‌ హన్సల్‌ మెహతా, అశ్విని చౌదరి సహా నటులు సూరజ్‌ థాపర్‌, ఆసిఫ్‌ షేక్‌, టినా ఘాయ్‌ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. (చదవండి: మరో విషాదం : కమెడియన్‌ కన్నుమూత)

ఇక పలు సినిమాల్లో నటించిన ఆశిష్‌ రాయ్‌.. బనేగీ అప్నీ బాత్‌, ససురాల్‌ సిమర్‌ కా, కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ వంటి హిందీ హిట్‌ సీరియల్స్‌లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. కాగా కిడ్నీలు పాడైపోవడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనను.. బిల్లు కట్టలేదన్న కారణంతో ఈ ఏడాది జూన్‌లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న ఆశిష్‌ రాయ్‌.. పెద్ద మనసుతో తనను ఆదుకోవాల్సిందిగా అభిమానులు, సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు. తన వద్ద డబ్బు లేదని, కానీ బతకాలని ఉందంటూ తన దీనస్థితిని వివరించారు. సల్మాన్‌ ఖాన్‌ వంటి అ‍గ్ర నటులను కూడా సాయం కోసం అర్థించానని, అయినా ఫలితం లభించలేందంటూ గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశిష్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు