RNR Manohar: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

17 Nov, 2021 19:10 IST|Sakshi

చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌(61) కన్నుమూశారు. కోవిడ్‌ బారిన పడిన ఆయనను 20 రోజుల క్రితం చెన్నైలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కరోనాతో పోరాడుతూ.. బుధవారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మనోహర్‌ మరణంపై తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 

ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌ కోలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1995లో `కోలంగల్‌` చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. దిల్, తెన్నవాన్, వీరమ్, సలీమ్, ఎన్నై అరిందాల్, నానుమ్ రౌడీ దాన్, వేదాలం, విశ్వాసం, కాంచన -3, అయోగ్య లాంటి చిత్రాల్లో నటుడిగా మెప్పించారు.

`మాసిలమణి`(2009) చిత్రానికి దర్శకత్వం వహించి, తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాడు. నంద, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ డ్రామా ‘వెల్లూర్ మావట్టమ్’కు కూడా ఆయనే దర్శకుడు. ఇటీవల విడుదలైన ఆర్య ‘టెడ్డీ’ సినిమాలో హీరోయిన్ సాయేషా సైగల్ తండ్రిగా ఆయన నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న విశాల్ ‘సామాన్యుడు’ సినిమాలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మనోహర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

మరిన్ని వార్తలు