రూ.25 కోట్ల రుణం కేసు: అప్పటివరకు దర్శన్‌ వెంటే ఉమాపతి..

18 Jul, 2021 07:54 IST|Sakshi
దర్శన్‌, ఉమాపతి (ఫైల్‌)

మైసూరు: నా ఆస్తులకు నకిలీ పత్రాలను సృష్టించి మోసం చేయాలని చూసిన కేసు నుంచి దృష్టి మళ్లించడం కోసం ఇతరత్రా అంశాలను తీసుకొచ్చారని, ఈ గొడవలకు– దొడ్మనెకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ నటుడు దర్శన్‌ అన్నారు. శనివారం మైసూరులోని తన ఫాంహౌస్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధైర్యం ఉన్న ఎవరైనా నాపై ఆరోపణలు చేస్తే వాటికి సమాధానం ఇస్తానన్నారు. డా.రాజ్‌ కుమార్‌ బ్యానర్‌ వల్లనే తాము అన్నం తిన్నామని, దొడ్మనెలో ఉన్న గడ్డిపోచకు కూడా సరిపోమన్నారు.  

మొత్తం ఈ గొడవకు కారణం నిర్మాత ఉమాపతినే అని, రూ.25 కోట్ల కేసును తప్పుదోవ పట్టించడానికి  దొడ్మనెను కూడా లాగుతున్నారని మండిపడ్డారు. హోటల్లో తాను సప్లయర్‌ను బెదరించిన మాట వాస్తవమే కానీ అతన్ని కొట్టలేదని చెప్పారు. కాగా, మొన్నటివరకు ఉమాపతి దర్శన్‌కు ఆప్తమిత్రునిగా వెంట ఉండడం తెలిసిందే.  

హోటల్లో పోలీసుల విచారణ..  
మైసూరులోని సందేష్‌ ది ప్రిన్స్‌ హోటల్‌లో సప్లయర్‌పై నటుడు దర్శన్‌ దాడిచేశాడనే కేసులో శనివారం ఏసీపీ శశిధర్‌ నేతృత్వంలో పోలీసులు విచారణ జరిపారు. హోటల్‌లోని సిసి కెమెరా చిత్రాలను తీసుకోవడంతో పాటు సిబ్బందిని ప్రశ్నించారు. గొడవ జరిగిన రోజున హోటల్లో ఉన్న సిబ్బంది అందరూ విచారణకు రావాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు