Dilip Kumar: దిగ్గజ నటుడి మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం

7 Jul, 2021 11:12 IST|Sakshi

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దిలీప్‌ కుమార్‌ మృతి భారతీయన సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’అని  సీఎం జగన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

‘దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ మరణం బాధాకరం. నేటి తరం నటులకు ఆయన ఆదర్శం. మీదైన నటనతో మధుర జ్ఞాపకాలను అందించిన దిలీప్‌ సర్‌కు ధన్యవాదాలు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

కాగా, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్‌ కుమార్‌ (98) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్టర్. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నారు. దశాబ్దాల పాటు హిందీ చలనచిత్ర రంగాన్ని ఏలారు. భారతీయ చలన చిత్ర రంగంలో గోల్డెన్ ఏజ్‌గా చెప్పుకొనే తరానికి చెందిన నటుడాయన. దేవదాస్, మొఘల్-ఎ-ఆజమ్, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్, నయా దౌర్, మధుమతి, క్రాంతి, విధాత, శక్తి వంటి మైల్ స్టోన్స్ వంటి సినిమాల్లో నటించారు.

ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 1993లో ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2015లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో ఆయనను సన్మానించింది.

మరిన్ని వార్తలు