సూపర్‌స్టార్‌ ఆశీస్సులతో...

28 Oct, 2020 08:18 IST|Sakshi
నరేశ్, శరణ్, సురేశ్‌ 

‘‘మా కుటుంబం నుంచి వచ్చిన చాలామంది నటీనటులను ప్రేక్షకులు ఆదరించారు. శరణ్‌ని కూడా ఆదరించాలని కోరుకుంటూ, అతనికి నా అభినందనలు’’ అని సూపర్‌స్టార్‌ కృష్ణ అన్నారు. సీనియర్‌ నరేశ్‌కి మేనల్లుడు అవుతారు శరణ్‌. మాన్విత, కుశల కుమార్‌ బులేమని సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా రామచంద్ర వట్టికూటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీలత బి. వెంకట్, వెంకట్‌ బులేమని నిర్మాతలు. శరణ్, సురేశ్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సూపర్‌స్టార్‌ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. సుధీర్‌బాబు, నవీన్‌ విజయకృష్ణలు కెమెరా స్విచాన్‌ చేయగా వీకే నరేశ్‌ క్లాప్‌నిచ్చారు. సుధీర్‌బాబు, ఆయన సతీమణి ప్రియ స్క్రిప్ట్‌ను దర్శకుడు రామచంద్రకు అందించారు.

‘‘కృష్ణగారి ఆశీస్సులతో మా సినిమా ఆరంభం కావడం ఆనందంగా ఉంది. ఏడాదిన్నరగా నేను, దర్శకుడు ఈ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నాం’’ అన్నారు శరణ్‌. రామచంద్ర మాట్లాడుతూ– ‘‘కథ విన్న వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పిన నిర్మాత వెంకట్‌ గారికి రుణపడి ఉంటాను. మా టీమ్‌ సహకారంతో చక్కగా తెరకెక్కించి, పరిశ్రమలో నాకంటూ ఓ ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంటాను’’ అన్నారు. ‘‘నవంబర్‌ నెలాఖరున  రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి జనవరిలోపు సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా మొత్తం పూర్తి చేస్తాం’’ అన్నారు నిర్మాతలు శ్రీలత, వెంకట్‌. ఈ కార్యక్రమంలో జయసుధ, సాయితేజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు