పరిస్థితి అధ్వాన్నంగా ఉంది, బాధేస్తోంది: నిఖిల్‌

9 May, 2021 17:37 IST|Sakshi

కరోనా వల్ల పరిస్థితులు రోజురోజుకూ ఎంతలా దిగజారిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. కళ్ల ముందే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతోమంది కనీసం ఆసుపత్రి బెడ్లు కూడా దొరక్క విలవిల్లాడిపోతున్నారు. ఈ విషమ పరిస్థితులను చూసి చలించిపోయిన యంగ్‌ హీరో నిఖిల్‌ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. కోపం, ఫ్రస్టేషన్‌, నిరాశ, నిస్సహాయత వల్ల ఈ వీడియో చేస్తున్నాని పేర్కొన్నాడు.

"కరోనా వల్ల షూటింగ్స్‌ రద్దయ్యాయి. ఆ వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు నేను, నా ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటున్నాం. సోషల్‌ మీడియా ద్వారా నా ఫ్రెండ్స్‌తో కలిసి టీమ్‌ ఏర్పాటు చేశాను. దీని ద్వారా చాలామందికి ఆసుపత్రి బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇంజక్షన్లు అందించడం, ఐసీయూ వార్డులో చేర్పించడం వంటి సలు సహాయక చర్యలు చేపట్టాం. కానీ మేం చేసే సాయం సరిపోవడం లేదు. బయట పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది." 

"కళ్ల ముందే జనాలు చనిపోతున్నారు. ఆక్సిజన్‌ బెడ్‌ కావాలని ఓ కోవిడ్‌ పేషెంట్‌ ఫోన్‌ చేశాడు. అరగంటలో దాన్ని సమకూర్చి ఫోన్‌ చేయగా, అప్పటికే చనిపోయాడని చెప్పారు. ఇలాంటివి చూడటం చాలా బాధగా ఉంది. మనల్ని ఎవరో వచ్చి కాపాడతారనుకోవడం జరగని పని. నాయకులు ఒకర్ని ఒకరు బ్లేమ్‌ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. వాళ్లు మనల్ని కాపాడలేరు. కాకపోతే మానవత్వం ఇంకా మిగిలే ఉంది. జనాలు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఈ విపత్కరం సమయంలో అదొక్కటే పాజిటివ్‌ అంశం. దయచేసి మాస్కులు వేసుకోండి, ఎవరినీ కలవకండి" అని చెప్తూ నిఖిల్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

చదవండి: మందుల్లేక సతమతమవుతున్న కరోనా రోగికి నిఖిల్‌ సాయం

పెళ్లి వార్తలపై స్పందించిన చార్మి

మరిన్ని వార్తలు