Actor Prabhu-Sivaji Ganesan: నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు

8 Jul, 2022 10:43 IST|Sakshi

కోర్టు మెట్లు ఎక్కిన నటుడు ప్రభు సోదరిమణులు

271 కోట్ల రూపాయల ఆస్తిని సరిగ పంచలేదని ప్రభుపై ఆరోపణలు

ప్రముఖ నటుడు ప్రభు తమని మోసం చేశాడంటూ ఆయన తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండ మోసం చేశారని  ఆరోపిస్తూ ప్రభు, ఆయన సోదరుడు రామ్‌కుమార్‌లపై వారిద్దరి సోదరిమణులు శాంతి, రజ్వీలు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్‌లు దిగ్గజ నటుడు, నడిగర్‌ తిలకం శివాజీ గణేశన్‌ కుమారులనే సంగతి తెలిసిందే. వీరితో పాటు ఆయనకు శాంతి, రజ్వీ కూమార్తెలు కూడా ఉన్నారు.

అయితే శివాజి గణేశన్‌ చనిపోయిన 20 ఏళ్లకు ఆయన కుటుంబంలో ఆస్తి వివాదం నెలకొంది. దీంతో ఇది కాస్తా కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా తమ సోదరులైన ప్రభు, రామ్‌కుమార్‌లు మోసం చేశారని ఆరోపిస్తూ శాంతి, రజ్వీలు మద్రాస్‌ హైకోర్టులో పటిషన్‌ దాఖలు చేశారు. తండ్రి మరణం తర్వాత 271 కోట్ల రూపాయల ఆస్తిని సరిగ పంచలేదని, తమని మోసం చేసి పూర్తి ఆస్తిని తమ సోదరులిద్దరే కాజేశారని వారు పటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు తమకు తెలియకుండ ఆస్తులను కూడా విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని వారు కోర్టును కోరారు.

అదే విధంగా వెయ్యి తులాల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు , రామ్‌ కుమార్‌ అపహరించడమే కాకుండా శాంతి థీయేటర్లో ఉన్న రూ. 82 కోట్ల విలువైన వాటాను రహస్యంగా వారిద్దరి పేరిట మార్చుకున్నట్లు వారు ఆరోపించారు. తమ తండ్రి రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని.. జనరల్‌ పవర్‌ ఆఫ్‌ ఆటార్నీపై సంతకం తీసుకుని తమని మోసం చేశారని వారు తెలిపారు. ఈ కేసులో నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్ల పేర్లను మాత్రమ కాకుండా వారి కుమారులైన విక్రమ్‌ ప్రభు, దష్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్‌లో వారి పేర్లను పేర్కొన్నారు. 

చదవండి: 
తంతడి బీచ్‌లో నాగచైతన్య సందడి 

నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు