బతికించండి అంటూ నటుడి పోస్ట్‌, కాసేపటికే మృతి

9 May, 2021 18:32 IST|Sakshi

వెబ్‌ సిరీస్‌ నటుడు రాహుల్‌ వోహ్రా కరోనాతో కన్నుమూశాడు. మంచి చికిత్స లభిస్తే తప్పకుండా బతుకుతాను అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టిన కొద్ది గంటలకే ఆయన మరణించడం విషాదకరం. కాగా కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన రాహుల్‌ వోహ్రా ఢిల్లీలోని ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాడు. ఈ విషయాన్ని మే 4వ తేదీన తనే స్వయంగా అభిమానులకు తెలియజేస్తూ తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు.

కరోనా సోకడంతో ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యానని, కానీ కోలుకోలేకపోతున్నానని చెప్పాడు. ఆక్సిజన్‌ లెవల్స్‌ క్రమక్రమంగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. తన బాగోగులు చూసుకునే వాళ్లే లేకుండా పోయారని ఆవేదన చెందాడు. ఏదైనా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ బెడ్‌ అందుబాటులో ఉంటే చెప్పండని అభ్యర్థించాడు. ఫ్యామిలీ కూడా టచ్‌లో లేదని అందుకే ఈ పోస్ట్‌ పెడుతున్నట్లు వివరించాడు. ఇక తన పరిస్థితి మరింత క్షీణించడంతో శనివారం మరో పోస్ట్‌ పెట్టాడు రాహుల్‌.. "నాకు మంచి ట్రీట్‌మెంట్‌ అందితే ప్రాణాలతో బయటపడతాను. నిజంగా ఇది జరిగి తీరితే నాకు పునర్జన్మ దొరికినట్లే లెక్క" అని చెప్పుకొచ్చాడు.

ఇది పెట్టిన కొద్ది గంటలకే అతడు చనిపోయాడంటూ దర్శకుడు అరవింద్‌ గౌర్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. "మంచి చికిత్స అందిస్తే బతికే అవకాశం ఉందని ఆశపడ్డాడు. వెంటనే అతడిని వేరే ఆస్పత్రికి షిఫ్ట్‌ చేశాం, కానీ బతికించలేకపోయాం.." అని విచారం వ్యక్తం చేశాడు.

చదవండి: అభిషేక్‌ బచ్చన్‌ ట్వీట్‌: ఆయన కన్నా గొప్ప నటుడు ఎవరూ లేరు

మరిన్ని వార్తలు