Sarathkumar: రమ్మీ నాలెడ్జ్‌ గేమ్‌!.. నటుడు శరత్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు 

14 Dec, 2022 10:08 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఆన్‌లైన్‌ రమ్మీ.. నాలెడ్జ్‌ గేమ్‌ అని సమత్తువ మక్కల్‌ కట్చి నేత, సినీ నటుడు శరత్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, బెట్టింగ్‌ గేమ్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రాజ్‌ భవన్‌ వర్గాలు పట్టించుకోలేదు. ఈ చట్టాన్ని ఆమోదించాలని అన్ని వైపుల నుంచి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై ఒత్తిడి వస్తోంది. అయితే ఆన్‌లైన్‌ రమ్మీకి ప్రచారకర్తగా సినీ నటుడు శరత్‌కుమార్‌ వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ గేమ్‌ను ప్రోత్సహించే విధంగా శరత్‌ ప్రకటనలు సామాజిక మాధ్యమాలలో హోరెత్తుతున్నాయి.

దీనిపై మీడియా మంగళవారం శరత్‌కుమార్‌ను ప్రశ్నించింది. ఇందుకు ఆయన సమాధానం ఇస్తూ రమ్మీ నాలెడ్జ్‌ గేమ్‌ అని వ్యాఖ్యనించారు. అయితే, తాను చెప్పినందు  ఈ గేమ్‌లను ఆడే వాళ్లు రాష్ట్రంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. తాను నిజాయితీగా ఓట్లు వేయమని అడిగితేనే వేయని వాళ్లు, తాను చెప్పినట్లుగా వింటారా?.. అని అన్నారు.

కాగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేందుకు రెండేళ్ల ముందుగానే ఈ ప్రకటన (యాడ్‌)ను చిత్రీకరించామని ఆయన వివరించారు. ప్రస్తుతం దీనిని ఆ సంస్థ ఇప్పుడు తెర మీదకు తెచ్చినట్లుందని పేర్కొన్నారు. అయితే, రమ్మీ  మేథా సంపత్తిని పెంచుతుందంటూ శరత్‌ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎక్కువయ్యాయి.   

మరిన్ని వార్తలు