వాళ్ల సినిమాలు నాకో కేస్‌ స్టడీ : సుధీర్‌బాబు

27 Aug, 2021 08:18 IST|Sakshi

‘‘సుధీర్‌ బాబు ఎలాంటి పాత్రలైనా చేయగలడు’ అనే పేరు వచ్చింది. కథలు రాసుకున్న తర్వాత ఆ పాత్రకు నేను సరిపోతాననే నమ్మకంతో నా వద్దకు వస్తున్నారు. అందుకే నాకు ఎక్కువ ఫెయిల్యూర్స్‌ లేవు. ఇండస్ట్రీలో నాకు లాంగ్‌ రన్‌ ఉంటుందనేది నా ఫీలింగ్‌. నా ప్రతి సినిమా నన్ను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తోంది’’ అన్నారు సుధీర్‌ బాబు. కరుణ కుమార్‌ దర్శకత్వంలో సుధీర్‌ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్‌ బాబు చెప్పిన విశేషాలు.

‘పలాస 1978’ సినిమా చూసి, మంచి లైన్‌ ఉంటే చెప్పండి, సినిమా చేద్దామని కరుణ కుమార్‌కి ఫోన్‌ చేశాను. కొద్ది రోజుల తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ లైన్‌ చెప్పారు, బాగుందన్నాను. ఇందులో ఎలక్ట్రీషియన్‌ సూరిబాబు పాత్రలో కనిపిస్తాను. తనకు ఇష్టమైన అమ్మలాంటి అమ్మాయితో ప్రేమలో పడ్డాక ఏం జరిగిందన్నదే కథ. చాలామంది మలయాళ సినిమా కథల గురించే మాట్లాడుకుంటారు. మా సినిమా చూశాక తెలుగు సినిమా కథల గురించి మాట్లాడుకుంటారు. ఒక గ్రామంలోని మనుషుల స్వభావాలు, అహం, రాజకీయాలను చూపించాం.

♦ కృష్ణగారు, మహేశ్‌ బాబుల సినిమాలను కేస్‌ స్టడీస్‌లా తీసుకుంటాను. అయితే వారిలా కాకుండా నా శైలిలో నటించేందుకు ప్రయత్నిస్తా. కేవలం అభిమానులు చూస్తే సినిమాలు హిట్‌ అయిపోవు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తేనే హిట్‌ అవుతాయి.. అందుకు తగ్గట్టే కథలను ఎంచుకుంటున్నాను. 

హీరోగా చేసేందుకే నా తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే విలన్, ఇతర పాత్రల గురించి ఆలోచిస్తా. ‘భాగీ’ తర్వాత హిందీలో అవకాశాలొచ్చినా తెలుగులో బిజీగా ఉండటంతో హిందీపై దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ సినిమా, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చేస్తున్నాను. ఆ తర్వాత పుల్లెల గోపీచంద్‌ బయోపిక్, హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ఓ సినిమా, ‘70 ఎంఎం’ బ్యానర్‌లోనే మరో సినిమా చేస్తాను. 

చదవండి :  'కథ చెప్పడానికి ఫోన్‌ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు'
హీరో శింబుకు ఊరట.. రెడ్‌కార్డు రద్దు

మరిన్ని వార్తలు