వివేక్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

17 Apr, 2021 09:06 IST|Sakshi

చెన్నై : ప్రముఖ కోలీవుడ్‌ హాస్యనటుడు వివేక్‌ (59) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు కె. బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ కూడా ఒకరు. మొదట స్క్రిప్ట్‌ రైటర్‌గా పనిచేసిన వివేక్‌ 'మనదిల్‌ ఉరుది వేండం' సినిమాతో నటుడిగా అరంగేట్రం​ చేశారు. ఆ తర్వాత తమిళంలో టాప్‌ కమెడియన్‌గా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు.

ఒకనొక సమయంలో ఆయన లేకుండా తమిళంలో సినిమాలు రిలీజ్‌ అయ్యేవి కావని, అంతటి పాపులారిటీ ఉండేదని సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయనను 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగులోనూ డబ్బింగ్‌ చిత్రాలతో వివేక్‌ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాయ్స్‌, శివాజీ, ప్రేమికుల రోజు, అపరిచితుడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వివేక్‌ కొడుకు ప్రసన్నకుమార్‌ 13 ఏళ్ల వయసులో మొదడులో రక్తం గట్టకట్టడంతో చనిపోయాడు.

అనారోగ్యం కారణంగా వివేక్‌ తల్లి కూడా మరణించింది. కొడుకు, తల్లి ఆకస్మిక మరణాలతో వివేక్‌ బాగా కృంగిపోయాడని, అప్పటినుంచి సినిమాలు చేయడం కూడా తగ్గించాడని ఆయన సన్నిహితులు తెలిపారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్‌ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్‌ మృతి పట్ల దేవీశ్రీ ప్రసాద్‌, ఏఆర్‌. రెహమాన్‌, సుహాసిని, ప్రకాశ్‌రాజ్, రాఘవ లారెన్స్‌, జీవా, సమంత, ధనుష్‌, విజయ్‌, సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 


చిన్న వయసులోనే పెద్ద పేరు
హాస్యనటుడు వివేక్‌ మృతిపట్ల తమిళ సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అద్భుతమైన నటనతో చిన్న కలైవానర్‌గా పేరుతెచ్చుకుని కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని తెలిపారు. తన తమ్ముడిలాంటి వివేక్‌ ఇక లేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. వివేక్‌ కుటుంబ సభ్యులకు సత్యరాజ్‌ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈమేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.

చదవండి : ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు