సౌందర్య ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బంగ్లా ఇప్పుడెలా ఉందంటే!

21 Jun, 2021 20:00 IST|Sakshi

సౌందర్య... తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. ఆమె పేరు తలుచుకోగానే చక్కటి చీరకట్టులో ఓ అందమైన రూపం కళ్లముందు కదులుతుంది. ఇప్పటివరకు ఎంతో మంది  హీరోయిన్లు వచ్చినా సౌందర్య చాలా ప్రత్యేకం. చనిపోయే వరకు ఎక్స్‌పోజింగ్‌, గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ కూడా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. ఆమె ఈ లోకాన్ని విడిచి 17 ఏళ్లవుతున్నాఇప్పటికీ ఆమెను మరిచిపోలేని అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతలా తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఆమె. ఏ పాత్రలో అయినా ఓదిగిపోయే సౌందర్య తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు.

చనిపోయేనాటికి సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. వివాహం జరిగి ఏడాది కూడా కాకుండానే సౌందర్య మరణం ఆమె అభిమానులను ఎంతగానో కలిచివేసింది. కాగా కెరీర్ చివర్లో సంచలన సినిమాలు చేసిన సౌందర్య జీవితంలో ఎన్నో చెప్పుకొదగ్గ ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆమె బతికున్న రోజుల్లో తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలో మెడికల్ కాలేజీతో పాటు స్కూల్స్ ను స్థాపించి ఉచిత విద్యను అందించి గొప్ప మనసు చాటుకున్నారు. 2004లో జరిగిన ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడూ మరణించడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వారు లేకపోయిన ఇప్పటికీ ఆ స్కూల్స్‌కు సౌందర్య కుటుంబం ఆర్థిక సాయం చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.

అప్పటి లెక్కల ప్రకారం సౌందర్యకు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గతంలో ఆమె కుటుంబ సభ్యులే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నటి ఆమని కూడా ఓ ఇంటర్వ్యూలో సౌందర్య ఆస్తుల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో సౌందర్య తనకు మంచి సన్నిహితురాలని, తామిద్దరం ప్రాణ స్నేహితులుగా ఉండేవారమని ఆమె చెప్పారు. సౌందర్య చనిపోయిన విషయం తాను నమ్మలేకపోయానని.. అయితే సౌందర్య మరణించిన కొన్నాళ్ళకు బెంగళూరులోని ఆమె బంగ్లాకు వెళ్లినట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. ‘సౌందర్య ఉన్నపుడే ఆ బంగ్లాను ఎంతో ఇష్టపడి కొనుక్కుంది. తను బతికున్నపుడు బంగ్లా దేదీప్యమానంగా వెలిగిపోయేది. కానీ ఇప్పుడు అది ఓ బూత్‌ బంగ్లా మారిపోయింది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సౌందర్య మరణించిన అనంతరం కొన్నాళ్లకు ఆ బంగ్లాకు తాను వెళ్లానని, అక్కడ ఎవరూ లేరని ఆమని పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందటి వరకు సౌందర్య తల్లి అక్కడ ఉండేవారని, తనని కలుద్దామని అక్కడి వెళ్లేసరి ఇప్పుడు అక్కడ ఎవరూ లేరని, ఆ బంగ్లా పూర్తిగా పాతబడిపోయి చూడటానికి బూత్ బంగ్లాలా కనిపించినట్లు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా సౌందర్య పేరుతో బయోపిక్ వస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు నిత్యా మీనన్ పేరు కూడా వినిపిస్తోంది. 

మరిన్ని వార్తలు