Ashnoor Kaur: సీబీఎస్‌ఈ ఫలితాల్లో సత్తా చాటిన నటి

31 Jul, 2021 20:12 IST|Sakshi

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారు చదువులో పెద్దగా రాణించలేరు. నిత్యం షూటింగ్స్‌తో బిజీ, బిజీగా ఉండడం వల్ల చదువుపై దృష్టిపెట్టలేకపోతారు. కానీ కొందరు మాత్రం చదువు వేరు, నటన వేరని నిరూపిస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. చదువులో సత్తా చాటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్‌ నటి  అష్నూర్‌ కౌర్‌ ఒకరు. ఝాన్సీకి రాణి, యే రిస్తా క్యా కహ్లాతా హై,  పాటియాల బేబ్స్‌ లాంటి సీరియల్స్‌తో పాటు సంజు చిత్రంలోనూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అష్నూర్‌ కౌర్‌.. తాజాగా ప్రకటించిన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో 94శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. సాధారణ విద్యార్థులకు ఈ మార్కులు రావడం పెద్ద విషయమేమీ కాదు, కానీ నటిగా షూటింగ్స్‌లో బిజీగా ఉంటూ.. 94 శాతం మార్కులు సాధించడం మాములు విషయం కాదు. 
ఈ ఫలితాలపై  అష్నూర్‌ కౌర్‌ స్పందిస్తూ... ‘ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు. వర్క్‌ గ్యాప్‌లో చదువుకొని, చాలా కష్టపడి పరీక్షలు రాశాను. రిజల్ట్‌ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. పదో తరగతి పరీక్షల్లో 93 శాతం మార్కులు వచ్చాయి. అయితే 12వ తరగతిలో అంతకంటే ఎక్కువగా మార్కులు సాధించాలని అనుకున్నాను. అనుకున్నట్లే కష్టపడి చదివి, మంచి మార్కులు సాధించాను.నా చదువుని ఇంతటితో ఆపాలనుకోవడం లేదు. బి.బి.ఎం(బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియా)లో డిగ్రీ చేసి, మాస్టర్స్‌ చదవడం కోసం విదేశాలకు వెళ్లాను’అని చెబుతోంది ఈ వర్థమాన నటి. 

ఇక ఇటీవల సొంత ఇంటిని కలను కూడా సాకారం చేసుకుంది ఈ బ్యూటీ. పదిహేడేళ్ల వయసూలో తన సొంత డబ్బుతో ఇల్లుని కొనుక్కుందట. అది తన డ్రీమ్‌ హౌస్‌ అని, త్వరలోనే ఇంటి పనులు పూర్తిచేసుకొని, వచ్చే ఏడాదిలో గృహ ప్రవేశం చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు అష్నూర్ కౌర్ వెల్లడించింది.

 

మరిన్ని వార్తలు