మాజీ మంత్రికి నటి షాక్‌.. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ

24 Jul, 2021 07:03 IST|Sakshi
మాజీమంత్రి మణికంఠన్, నటి చాందిని

తమిళసినిమా: అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు నటి చాందిని షాక్‌ ఇచ్చారు. మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్థానిక బీసెంట్‌నగర్‌కు చెందిన మలేషియాకు చెందిన నటి చాందిని. అన్నాడీఎంకేకు చెందిన మాజీమంత్రి మణికంఠన్‌ పెళ్లి చేసుకుంటానని తనతో సహజీవనం చేసి మోసం చేశారని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి మణికంఠన్‌ను అరెస్టు కూడా చేశారు.

ప్రస్తుతం ఈ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాందిని గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో మాజీమంత్రి మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అదే విధంగా తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో అందుకు తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రినే చెల్లించాలని ఆ పిటిషన్‌లో కోరారు. కాగా నటి చాందిని పిటిషన్‌ వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది.

మరిన్ని వార్తలు