నటితో సహజీవనం.. పిల్లాడు పుట్టాక పెళ్లి.. అబార్షన్‌ చేయించుకోలేదని..

9 May, 2023 15:19 IST|Sakshi

పసిపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలంటారు. కానీ ఓ నటి భర్త మాత్రం కన్నకొడుకునే బండకేసి కొట్టాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. అబార్షన్‌ చేసుకోలేదన్న కోపంతోనే అతడు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గాయాలపాలైన పిల్లాడిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అదాలత్‌, సీఐడీ, సావధాన్‌ ఇండియా: క్రైమ్‌ అలర్ట్‌ వంటి పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది నటి చంద్రిక సాహా. గతంలో ఒకరిని పెళ్లాడి విడాకులిచ్చిన ఆమెకు 2020లో వ్యాపారవేత్త అమన్‌ మిశ్రతో పరిచయమేర్పడింది. ఇద్దరూ సహజీవనం చేశారు. ఈ క్రమంలో నటి గర్భం దాల్చింది. అబార్షన్‌ చేసుకోవాలని అమన్‌ ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలయ్యేవి. పిల్లాడు పుట్టిన తర్వాత కూడా ఆ గొడవలు సద్దుమణగలేదు. గత నెలలోనే చంద్రిక, అమన్‌ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయానికి బాబు వయసు 14 నెలలు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో అమన్‌ తన రాక్షసబుద్ధి చూపించాడు. 

శుక్రవారం నటి కిచెన్‌లో వంట చేసుకుంటుండగా బాబు ఏడుపు వినిపించింది. తను పనిలో ఉండటంతో బాబును ఆడించమని భర్తకు చెప్పింది. దీంతో అతడు బాబును తీసుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. ఈసారి పిల్లవాడు గుక్కపెట్టి ఏడవడంతో పాటు బాదిన శబ్ధం వినిపించింది. వెంటనే ఆమె గదిలోకి వెళ్లి చూడగా పిల్లవాడి శరీరంపై గాయాలు కనిపించాయి. వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించింది. తర్వాతి రోజు అనుమానం వచ్చి సీసీటీవీ పరిశీలించగా భర్త చేసిన దారుణం కళ్లారా చూసి ఒక్కసారిగా ఖంగుతింది. తన కొడుకును భర్తే స్వయంగా మూడుసార్లు నేలకేసి కొట్టాడు. ఈ వీడియో ఆధారంగా నటి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

చదవండి: ఆదిపురుష్‌ ట్రైలర్‌.. పోలా.. అదిరిపోలా..

మరిన్ని వార్తలు