కుష్బూ సెట్టింగ్‌.. కంటైనరే కార్యాలయం 

3 Mar, 2021 08:18 IST|Sakshi

సాక్షి, చెన్నై: సినిమా వాళ్లు ఏ పనిచేసినా, అందులో వైవిధ్యం, వినూత్నం, అభిమాన ఆకర్షణ దిశగానే ఉంటాయి. ఆ దిశగా సినీ నటి, బీజేపీ నేత కుష్బూ పయనం ఉంటున్నది. సినీ తరహాలో తన పార్టీ ఎన్నికల కార్యాలయం సెట్టు వేయించుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. డీఎంకే, కాంగ్రెస్‌లో ఎన్నికల్లో పోటీకి అవకాశం రాకున్నా, తాజాగా బీజేపీలో తనకు ఆ అవకాశం దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. చేపాక్కం–ట్రిప్లికేన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయడం ఖాయం అన్న సంకేతాలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో తిష్టవేసి, ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాల్లో ఆమె ఉన్నారు. ఆ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఇది తాత్కాలికమే కావడంతో, దానిని సినీ తరహా సెట్టింగ్‌తో రూపొందించుకున్నారు. అన్నాసాలైలోని ఎల్‌ఐసీ పక్కనే ఉన్న తొమ్మిది గ్రౌండ్ల స్థలంలో ఈ సెట్టింగ్‌ వేశారు. ఇక్కడ నాలుగు కంటైనర్లు ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇందులో ఒక కంటైనర్‌ కుష్బూకు కార్యాలయంగా మార్చేశారు. మిగిలిన మూడింటిని నియోజకవర్గ నిర్వాహకులు, ఇతర ముఖ్యులు ఎన్నికల పనులపై దృష్టి పెట్టే రీతిలో ఆఫీసుగా మార్చేశారు. ఇక్కడ ఏసీ, కంప్యూటర్, ప్రింటర్‌ అంటూ అన్ని రకాలు వసతులు కలి్పంచడమే కాదు, కేడర్‌ తరలివచ్చినా, ఏదేని సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా, అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని ఉండడం విశేషం. 

హేమమాలిని రాక.. 
నటి హేమమాలిని తమిళనాడుకు చెందిన వారే. బాలీవుడ్‌లో స్థిర పడ్డా ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాజాగా ఆమె సేవల్ని ప్రచారానికి ఉపయోగించుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. నాలుగు రోజులపాటు హేమమాలిని ఎన్నికల ప్రచారానికి కసరత్తులు చేట్టారు. ఈ ప్రచారంలో ఆమె తమిళంలోనే ప్రచారం సాగించబోతున్నారని కమలనాథులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు