అందుకే సినిమాలకు గ్యాప్‌ ఇచ్చా: మేఘా ఆకాశ్‌

14 Aug, 2021 17:37 IST|Sakshi

‘లై, ఛల్‌ మోహన రంగ’ చిత్రాల తర్వాత తెలుగులో నాకు సరైన కథలు రాలేదు.. అందుకే ఏదీ ఒప్పుకోకపోవడంతో ఇక్కడ గ్యాప్‌ వచ్చింది. ఈ గ్యాప్‌లో తమిళంలో మంచి స్క్రిప్ట్స్‌ రావడంతో అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. ప్రస్తుతం తెలుగులోనూ మంచి కథా బలం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నాను’ అని హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌ అన్నారు. శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్‌ గోలి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా మేఘా ఆకాశ్‌ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ భాష ఆధారంగా స్క్రిప్ట్స్‌ ఒప్పుకోను. మంచి కథ ఏ భాషలో ఉన్నా నటిస్తా. ‘రాజరాజ చోర’ కథ వైవిధ్యంగా ఉంది.     నా నిజ జీవితానికి భిన్నమైన పాత్రను ఇందులో చేశాను. ఇప్పుడు ఓ స్థాయికి వచ్చాను కాబట్టి ప్రయోగాత్మక పాత్రలు చేయాలనుకుంటున్నాను. మా అమ్మ, నాన్న నా సినిమాల ఎంపికలో జోక్యం చేసుకోరు. అమ్మ కథ వింటుంది కానీ చేయాలా? వద్దా? అనే నిర్ణయం నాదే.  ప్రస్తుతం ‘డియర్‌ మేఘ, మనుచరిత్ర, గుర్తుందా శీతాకాలం (అతిథి పాత్ర)’ చేస్తున్నాను.  మరో సినిమా ప్రకటన త్వరలో వస్తుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు