Actress Molestation Case: మరోసారి తెరపైకి నటి లైంగిక దాడి కేసు, దిలీప్‌ భార్యను విచారించిన పోలీసులు

10 May, 2022 14:39 IST|Sakshi

Kerala Police Investigate Accused Dileep Wife Kavya Madhavan: ప్రముఖ హీరోయిన్‌ లైంగిక దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ  కేసులో ప్రధాన నిందితుడైన స్టార్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ భార్య కావ్య మాధవన్‌ను తాజాగా కేరళ క్రైం పోలీసులు విచారించారు. ఈ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు ఇటీవల బయటకు వచ్చిన కొన్ని ఆడియో క్లిప్స్‌తో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న దిలీప్‌ బావ మరిది సూరజ్‌, శరత్‌లకు సంబంధించి కొన్ని ఆడియో క్లిప్‌లు బయటకు వచ్చాయి

చదవండి: బాలీవుడ్‌ నన్ను భరించలేదు: మహేశ్‌ బాబు షాకింగ్‌ కామెంట్స్‌

దీంతో ఈ కేసులో దిలీప్‌ భార్య కావ్య మాధవన్‌ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన కేరళ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఆలువాలోని తన నివాసంలో దాదాపు 4 గంటల పాటు ఆమెను విచారించారు. అయితే ఈ విచారణంలో కావ్య పోలీసులకు సహకరించలేదని తెలిసింది. పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ‍్నలకు ఆమె సంబంధం లేని సమాధానాలు ఇచ్చిందని, మరికొన్నింటికి గుర్తులేదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే గతంలో కావ్యకు పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేయగా తాను చెన్నైలో ఉన్నందున విచారణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

చదవండి: నాన్న బయోపిక్‌లో నేను నటించలేను: మహేశ్‌ బాబు

ఈ క్రమంలో ఇటీవల ఆమెకు మరోసారి సమన్లు ఇచ్చిన పోలీసులు నిన్న విచారించగా తన నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2017 ఫిబ్రవరి 17న షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్‌ను కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో  రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్‌ కుమార్‌ బెయిల్‌పై విడుదల కాగా... అతని సోదరుడు అనూప్‌, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు