Nayanthara: నయన్ సంచలన నిర్ణయం.. తగ్గేదేలే..!

11 Feb, 2023 19:10 IST|Sakshi

పోడాపోడి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైనా నానుమ్‌ రౌడీదాన్‌ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార భర్త విగ్నేశ్‌ శివన్‌. తాజాగా నటుడు అజిత్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం వరించింది. ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించాల్సి ఉంది. అయితే ఈ సమయంలో శివన్‌కు ఊహించని రీతిలో షాకిచ్చారు స్టార్ హీరో అజిత్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ. 

అందుకు కారణం విగ్నేశ్‌ శివన్‌ చెప్పిన కథ నటుడు అజిత్‌కు, లైకా సంస్థకు నచ్చకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే అజిత్‌ నటించిన తునివు ఇటీవల విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. కథలో కొన్ని మార్పులు చేయాలని చెప్పినా అందుకు విగ్నేశ్ శివన్‌ నిరాకరించినట్లు టాక్‌. దీంతో నటి నయనతార రంగంలోకి దిగినా ఫలితం లేకపోయిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో నయనతార కఠిన నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

నయనతార ఇకపై అజిత్ సరసన సినిమాల్లో నటించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది . తన భర్త విగ్నేశ్ శివన్‌కు చిత్రానికి అజిత్, లైకా ప్రొడక్షన్స్ తిరస్కరించటమే కారణంగా భావిస్తున్నారు. కాగా.. నయన్, అజిత్ నటించిన బిల్లా, ఆరంభం, విశ్వాసం సినిమాలు మంచి విజయాల్ని సాధించాయి. ఇకపై నయన్, అజిత్‌ తెరపై కనిపించరన్న వార్త అభిమానులకు మింగుడు పడడం లేదు. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరికొన్ని రోజులు ఆగితే స్పష్టత వచ్చే అవకాశముంది. 
 

మరిన్ని వార్తలు