Nayanthara: నయనతార ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవుతారు

18 Sep, 2022 08:23 IST|Sakshi

సంచలనానికి మారుపేరు నయనతార అనవచ్చునేమో. గత రెండు దశాబ్దాలుగా ఈమె వార్తల్లో ఉంటూనే ఉంది. 2003లో కోలీవుడ్‌లో అయ్యా చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. ఆ తరువాత తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బహూభాషా నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న లేడీ సూపర్‌ స్టార్‌ స్థాయికి ఎదిగిపోయింది. ఇక ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 ఇప్పటి వరకు ఆమె తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో 75 చిత్రాలు చేసింది. ప్రస్తుతం చిత్రానికి రూ.10 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఆమె గురించి తెలిసిన విషయాలు అయితే తాజాగా ప్రచారంలో ఉన్న కథనం ఏంటంటే.. ఆమె కూడబెట్టిన ఆస్తి విలువ రూ.165 కోట్లు. ఇది నయనతార ఆదాయశాఖకు దాఖలు చేసిన లెక్కల వివరాల ప్రకారం జరుగుతున్న ప్రచారం. 

ఈమె సినిమాలో నటిస్తునే పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. దీనికి ఒక్కో సంస్థ నుంచి రూ.5 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. హైదరాబాదులో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలో తన తల్లిదండ్రులు నివసిస్తున్న ఇల్లు అంటూ దేశవ్యాప్తంగా పలు సొంత నివాసాలను ఏర్పరచుకుంది. హైదరాబాదులోని ఒక్కో ప్లాట్‌ సుమారు రూ.15 కోట్లు విలువ చేస్తుందని సమాచారం. అక్కడ అత్యంత విలువైన బంజారాహిల్స్‌ ప్రాంతంలో నయనతార ప్లాట్లు కొనుగోలు చేసింది. అదే విధంగా ఇటీవల ఈమె ఒక జెట్‌ విమానాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక వ్యాపార రంగంలోనూ నయనతార దూసుకుపోతుంది. డాక్టర్‌ వనిత రాజన్‌తో కలిసి లిప్‌ బామ్‌ కంపెనీని ప్రారంభించింది. ఇటు సినీ నిర్మాతగానూ బాగానే సంపాదిస్తోంది.  

మరిన్ని వార్తలు