Nidhi Agarwal: ఆయనకు జతగా అవకాశం వస్తే చాలు..  పారితోషికం వద్దు

3 Dec, 2022 07:24 IST|Sakshi

స్టార్‌ ఇమేజ్‌ కోసం ఐదేళ్లుగా పోరాడుతున్న నటి నిధి అగర్వాల్‌. ఈ హైదరాబాద్‌ బ్యూటీ తొలుత బాలీవుడ్‌లోకి  ప్రవేశం చేసినా అక్కడ వర్కౌట్‌ కాకపోవడంతో తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హలో ఆమె నటించిన సవ్యసాచి చిత్రం నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత రామ్‌తో జత కట్టిన ఇస్మార్ట్‌ శంకర్‌ సంచలన విజయాన్ని సాధించినా అది దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్‌ల ఖాతాలోనే  చేరిపోయింది మినహా నిధి అగర్వాల్‌కి పెద్దగా ఉపయోగ పడలేదనే చెప్పాలి. కారణం తెలుగులో పెద్దగా అవకాశాలు ఏమి రావడం లేదు.

ఇంతకుముందు ఎప్పుడో పవన్‌ కళ్యాణ్‌కు జంటగా కమిట్‌ అయిన హరి హర వీరమల్లు చిత్రం ఒకటే ప్రస్తుతం ఆమె చేతిలో ఉంది. దీంతో నిధి అగర్వాల్‌ దృష్టి ఇతర భాషా చిత్రాలపై పడింది. అలా తమిళంలో శింబుతో చేసిన ఈశ్వరన్‌ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ఇక రవి సరసన నటించిన భూమి చిత్రం బాగుందనపించినా, అది ఓటీటీలో విడుదల కావడంతో ఈమె కెరీర్‌కి ప్లస్‌ కాలేకపోయింది.

తాజాగా ఉదయ నిధి స్టాలిన్‌తో జతకట్టిన కలగ తలైవన్‌పై నిధి అగర్వాల్‌ చాలా ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రం కూడా ఆమెకు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో నెక్ట్స్‌ ఏంటి అనే ఆలోచనలో పడ్డ నిధి అగర్వాల్‌ తాజాగా నటుడు ధనుష్‌కు గాలం వేసే పనిలో పడింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌ లో బిజీగా ఉన్న నటుడు ధనుష్‌. దీంతో ఆయనతో జతకట్టాలని ఆకాంక్షను నిధి అగర్వాల్‌ వ్యక్తం చేసింది. ఆమె ఒక భేటీలో పేర్కొంటూ ధనుష్‌తో నటించే అవకాశం వస్తే పారితోషికం కూడా తీసుకోను అని పేర్కొంది. మరి ఈ ప్రయత్నం అయినా ఫలవంతం అవుతుందో లేదో చూడాలి.  

మరిన్ని వార్తలు