Actress Nikeet Dhillon: ఆ వార్త కుటుంబాన్ని మొత్తం ప్రభావితం చేసింది.. నటి ఆవేదన

29 Nov, 2022 15:26 IST|Sakshi

ప్రముఖ పంజాబీ నటి నికిత్ ధిల్లాన్ సోషల్‌ మీడియా ఖాతా ఇటివలే హ్యాకింగ్‌కు గురైంది. ఆమె ఖాతాలో హ్యాక్ చేసిన ఓ దుండగుడు నటి చనిపోయిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వెంటనే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలయింది.  ఈ వార్త విని నటి తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలిపింది. ఆ సమయంలో అత్యంత భయానక పరిస్థితి ఎదురైందన్నారు. కుటుంబ సభ్యులంతా తీవ్ర మనోవేదనకు గురయ్యారని నటి నికిత్ ధిల్లాన్ వివరించింది. ఆమె ఇన్‌స్టా పోస్ట్‌లో..  'మా ప్రియమైన కుమార్తె నికిత్ ధిల్లాన్ అకాల మరణాన్ని ప్రకటించడం చాలా బాధగా ఉంది. మా కుటుంబానికి గోప్యతను అనుమతించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అని రాసి ఉంది. ' హ్యాకర్ పోస్ట్ చేశారు.

నికిత్ ధిల్లాన్ మాట్లాడుతూ.. 'మా అమ్మమ్మ భటిండాలో నివసిస్తోంది. ఎవరో ఫోన్ చేసి నేను చనిపోయారని చెప్పారని తెలిసింది. వెంటనే ఆమె మా అమ్మని పిలిచి తీవ్రంగా ఏడ్చింది. ఆమె మానసికంగా కుంగిపోయింది. మేమంతా ఏం జరిగిన విషయం ఆమె వివరించినా ఓదార్చలేకపోయాం. హ్యాకింగ్, సోషల్ మీడియా గురించి ఆమెకు అర్థం కాలేదు. ఆమె వయసు రీత్యా మేం దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంది. ఈ వార్త ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసింది. మరుసటి రోజు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది'అంటూ ధిల్లాన్ భయానక పరిస్థితిని వివరించారు.

ఆమె మాట్లాడుతూ.. 'నా కలలో కూడా ఇంత దూరం వెళతారని నేను ఊహించలేదు. ఇలాంటి పరిస్థితికి ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. ఇది పబ్లిసిటీ స్టంట్‌ అని చాలా మంది భావించి ఉంటారు. కానీ నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఎంత షాక్‌కు గురయ్యారో నాకు మాత్రమే తెలుసు.'అని వాపోయింది పంజాబీ నటి.  దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం నా ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనప్పుడు మొహాలీ సైబర్ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా. అప్పుడు వారు నాకు ఎలాంటి సాయం చేయలేదు. కాల్ స్క్రీన్‌ షాట్ కూడా సైబర్ సెల్‌కు సమర్పించినా ఇప్పటికీ పట్టించుకోలేదని వాపోయింది నటి. ఇప్పుడు నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ గురి కావడంతో ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ' అని వాపోయింది. 

A post shared by Nikeet Dhillon (@nikeetdhillon)

మరిన్ని వార్తలు