అప్పటివరకు ఆరోగ్యంగా.. అంతలోనే బాత్రూమ్‌లో విగతజీవిగా నటి భర్త..

25 Mar, 2023 13:10 IST|Sakshi

బాలీవుడ్‌ నటి నీలూ కోహ్లి భర్త హర్మిందర్‌ సింగ్‌ కోహ్లి ప్రమాదవశాత్తూ బాత్రూమ్‌లో కాలు జారి మరణించాడు. శుక్రవారం ఉదయం గురుద్వారను దర్శించుకుని వచ్చిన ఆయన అంతలోనే బాత్రూమ్‌కి వెళ్లి ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. హర్మిందర్‌ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

నీలూ కోహ్లి స్నేహితురాలు వందన మాట్లాడుతూ.. 'హర్మిందర్‌ అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. పొద్దున్నే గురుద్వారకు కూడా వెళ్లి వచ్చాడు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బాత్రూమ్‌కు వెళ్లి కుప్పకూలిపోయాడు. తన ఇంట్లో ఓ పనిమనిషి ఉన్నాడు. అతడు హర్మిందర్‌ కోసం వంట సిద్ధం చేసిపెట్టాడు. లంచ్‌ సమయం దాటిపోతున్నా తను తినడానికి రాకపోవడంతో వెళ్లి అతడి రూమ్‌లో చూశాడు. తర్వాత బాత్రూమ్‌లో చూడగా అక్కడ కిందపడి కనిపించాడు. అతడు బాత్రూమ్‌ గడియ పెట్టుకోలేదు' అని చెప్పుకొచ్చింది. ఆదివారం హర్మిందర్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. భర్త మరణంతో నీలూ కోహ్లి షాక్‌లో ఉందని, తన పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగోలేదని వెల్లడించింది నటి కూతురు.

మరిన్ని వార్తలు