అందాల 'రాశీ'కి బర్త్‌డే విషెస్‌

30 Nov, 2020 12:15 IST|Sakshi

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్‌ రాశీ ఖన్నా సోమవారం 30వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇండస్ర్టీ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా హీరో వెంకటేష్‌, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సహా పలువురు ఈ బ్యూటీకి బర్త్‌డే విషేక్‌ తెలుపుతున్నారు. హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారం‍భించిన అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాశీ మొదట సింగర్‌ అవుదామని పలు ప్రయత్నాలు చేసిందట. అయితే సినిమాల్లోకి వచ్చాక మాత్రం ఆమె కల నిజమైంది. జోరు, విలన్‌, బాలకృష్ణుడు, జవాన్‌, ప్రతిరోజూ పండగే వంటి సినిమాల్లో పాడి తన డ్రీమ్‌ని పూర్తిచేసుకుంది. 1990 నవంబర్‌ 30న ఢిల్లీలో జన్మించిన రాశీ..విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. బీఏ ఇంగ్లీష్‌ పూర్తిచేసి ఐఏఎస్‌ కావాలని కలలు కందట. ఆ తర్వాత పలు యాడ్‌ సినిమాలకు కాపీ రైటర్‌గానూ పనిచేస్తున్న సమయంలోనే ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు వచ్చాయి.  (రాశీ ఖన్నా నోట.. ‘ఉండిపోరాదే’ పాట..)

జాన్‌ అబ్రహం సినిమా మద్రాస్‌ కేఫ్‌ చిత్రంతో తెరంగేట్రం చేసిన రాశీకి పలు అవకాశాలు వచ్చాయి. తెలుగులో శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమై పలు సినిమాల్లో నటించి మెప్పించింది.  పరాజయాలతో  సంబంధం లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. తెలుగులో సుప్రీమ్‌, జోరు, జిల్‌, హైపర్‌, జై లవకుశ, వెంకీ మామ, ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో హిట్‌ సాధించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ  హరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య అప్‌కమింగ్‌ సినిమా అరువా చిత్రంతో పాటు, అర్జున్‌ ముఖ్య పాత్రలో జీవా హీరోగా పీఏ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సైన్‌ చేసింది. అంతేకాకుండా  కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలోతెరకెక్కుతున్న చిత్రం తుగ్లక్‌ స్టార్‌ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్‌, ప్రియాంకచోప్రాతో సహా టాలీవుడ్‌లో మహేష్‌బాబు అంటే ఇష్టమని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. (ఇప్పటిదాకా ప్రేమలో పడలేదు: రాశీఖన్నా )

మరిన్ని వార్తలు