చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ రెండో భర్తపై నటి రాధ ఫిర్యాదు

5 Jul, 2021 08:29 IST|Sakshi

సాక్షి, చెన్నై: భర్తపై నటి రాధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుందరా ట్రావెల్స్, హడావిడి, గేమ్‌ తదితర చిత్రాల్లో కథానాయకిగా నటించారు రాధ. మనస్పర్థల కారణంగా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని కొడుకు, తల్లితో కలిసి జీవిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఎన్నూర్‌ పోలీస్‌స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వసంత రాజాను రెండో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రెండో భర్త వసంత రాజు తనని హింసిస్తున్నాడంటూ గత ఏప్రిల్‌ నెలలో  స్థానిక విరుగంబాక్కం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులో తనపై అనుమానం పెంచుకున్నారని, కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఆ తరువాత ఇద్దరు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుని కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మరోసారి భర్తపై స్థానిక వరంగమలై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త, ఆయన మిత్రులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తన భర్తతో పాటు అతని మిత్రులైన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ భారతి, ఇళంవరుదిలపై చర్యలు తీసుకోవాలని రాధ పోలీసులను కోరారు.

మరిన్ని వార్తలు