నటి రంభ.. వెండితెరకు దూరమై 13 ఏళ్లు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే!

8 Jun, 2021 13:54 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో జన్మించిన రంభ

తెలుగు అమ్మాయిగా పరిశ్రమలోకి ఎంట్రీ

హీరోయిన్‌గా భారత చలన చిత్ర పరిశ్రమల్లో సత్తా చాటిన రంభ

తెలుగు, హిందీ, తమిళ, కన్నడతో పాటు దాదాపు 8 భాషల్లో నటించిన రంభ

ఒకప్పుడు తెలుగు తెరపై స్టార్‌ హీరోలందరితో నటించి తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసిన నటి రంభ వెండితెరకు దూరమై దాదాపు 13 ఏళ్లు అవుతుంది. తెలుగు హీరోయిన్‌ అయినప్పటికి దాదాపు అన్ని భారత చలన చిత్ర పరిశ్రమల్లో నటిగా సత్తా చాటారు ఆమె. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, భోజ్‌పూర్‌, పంజాబీతో పాటు పలు పరిశ్రమల్లో రంభ నటించారు. ఆమె నటించిన సినిమాలన్ని దాదాపు సక్సెస్‌ను అందుకున్నాయి. రంభ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తెలుగు కుటుంబంలో జన్మించారు.

చదువుతున్న రోజుల్లో పాఠశాల, కళాశాలల్లో స్టేజ్‌ షోల్లో నటించిన రంభకు అనుకోకుండా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్‌ తగ్గిపోతున్న క్రమంలో రంభ ఒక్కసారిగా వెండితెరపై మెరిశారు. హిందీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా గ్లామర్‌ పాత్రలు పోషించి అందరిని మెప్పించారు. అలా తెలుగమ్మాయిలు గ్లామర్‌ పాత్రలకు అసలు సెట్‌ అవ్వరనే ముద్రను ఆమె చెరిపేసి తనదైన ముద్రను వేసుకున్నారు. అంతగా గుర్తింపు తెచ్చుకున్న రంభ సినిమాలకు దూరమయినప్పటికి సోషల్‌ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తున్నారు.

అయితే మొదట్లో రంభను చూసి అందరూ నార్త్‌ హీరోయిన్‌ అనుకున్నారట, తెలుగు హీరోయిన్‌ అంటే ఎవరూ నమ్మవారు కాదట. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు మూవీతో తొలి హిట్‌ అందుకుని ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారారు. మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున వంటి స్టార్‌ హీరోలందరితో నటించిన రంభ దాదాపు దశాబ్దా కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌ వుడ్‌ పరిశ్రమలోని స్టార్‌ హీరోలందరి సరసన ఆమె నటించారు. ఆ తర్వాత కూడా యువ హీరోలతో స్పెషల్‌ సాంగ్స్‌లో ఆడిపాడిన రంభ 2008 తర్వాత రెగ్యూలర్‌ మూవీస్‌ చేయడం మానేశారు.

అనంతరం 2010 వరకు అడపాదడపగా కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో నటించినప్పటికి అవి పెద్దగా గుర్తిపు పొందలేదు. ఈ క్రమంలో 2010లో శ్రీలంకన్ బిజినెస్ మెన్ ఇంద్రకుమార్ పథ్మనాథన్‌ను పెళ్లి చేసుకుని కెనడా వెళ్ళిపోయారు. ప్రస్తుతం కుటుంబంతో సహా అక్కడే సెటిలైయిపోయారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు సంతానం. తరుచు తన పిల్లలతో భర్తతో కెనడా సందడి చేస్తున్న ఫొటోలను రంభ సందర్భాన్ని బట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటారు. అయితే వివాహం అనంతరం కూడా పలు డ్యాన్స్‌ షోలకు జడ్జీగా వ్యవహరించిన ఆమె తిరిగి నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారో లేదో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు