Samara Tijori : 'మాసూమ్‌'తో మాయ చేస్తున్న సమారా

10 Jul, 2022 10:36 IST|Sakshi

సమారా తిజోరీ.. బాలీవుడ్‌ ఒకప్పటి హీరో, ఇప్పటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ దీప్‌క్‌ తిజోరీ, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శివానీ తిజోరీల కూతురు. ‘డిష్యుం’ సినిమాతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తల్లిదండ్రుల కీర్తితో కాకుండా తన ఆసక్తి.. ప్రతిభతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తోంది. అనుకున్నట్టుగానే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సిరీస్‌ ‘మాసూమ్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

పుట్టింది, పెరిగింది ముంబైలో.  న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి కూడా. 

సమారాకు పదమూడేళ్లున్నప్పుడు.. స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుంటే ప్రీతేశ్‌ దోషి అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్‌ చేశాడు. సంఘటన రిపోర్ట్‌ అయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఓ మూడు గంటల పాటు అనుమానాస్పద ప్రాంతాలను గాలించి.. కిడ్నాపర్‌ ఆ అమ్మాయిని మలాడ్‌లోని ఓ లాడ్జ్‌లో పెట్టినట్టు తెలుసుకుని అక్కడి నుంచి సమారాను రెస్క్యూ చేశారు. కిడ్నాప్‌కు కారణాలేంటో బయటకు రాలేదు కానీ డబ్బు కోసమే ప్రీతేశ్‌ అనే వ్యక్తి సమారాను కిడ్నాప్‌ చేసినట్టు బాలీవుడ్‌లో ఓ మాట. 

‘డిష్యుం’ తర్వాత సమారా ‘గ్రాండ్‌ ప్లాన్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించింది. అందులోని ఆమె నటనే ఆమెకు వెండి తెర మీద అవకాశాన్నిచ్చింది. ‘బాబ్‌ బిస్వాస్‌ (2021)’ అనే సినిమాలో.. అభిషేక్‌ బచ్చన్‌కు కూతురిగా.

జెఫ్‌ గోల్డ్‌బర్గ్‌ స్టూడియోలో చేరి నటనలో శిక్షణ పొందింది. డాన్స్‌లో కూడా ట్రైనింగ్‌ తీసుకుంది. 

ఇప్పటివరకు సమారా చేసిన సినిమాలన్నీ ఆమెను పరిచయం చేసినవిగానే మిగిలిపోయాయి. తాజాగా స్ట్రీమింగ్‌లో ఉన్న ‘మాసూమ్‌’ సిరీస్‌ మాత్రం నటిగా ఆమె ఉనికిని చాటుతోంది. 

‘మాసూమ్‌’కి వస్తున్న రెస్పాన్స్‌ను మాటల్లో చెప్పలేను. ‘మాసూమ్‌’ టీమ్‌ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. నా మీద నమ్మకముంచి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. భవిష్యత్‌లోనూ ఇది కొనసాగుతుందని ఆశిస్తున్నా.. అంటూ సోషల్‌ మీడియా ద్వారా  ‘మాసూమ్‌’ విజయానందాన్ని పంచుకుంది సమారా తిజోరీ.

చదవండి: పాన్‌లో విషం కలిపారు, సరిగ్గా తినే సమయంలో ఫోన్‌ రావడంతో..
నా దృష్టిలో లక్‌ అంటే అదే : తమన్నా

మరిన్ని వార్తలు