Aditi Shankar: నయనతార స్థానాన్ని భర్తీ చేస్తా..!

9 Aug, 2022 08:04 IST|Sakshi

సినీ ప్రముఖుల వారసులు ఆ రంగాన్నే ఎంచుకోవడం పరిపాటే. వారి పేరు, పరపతులతో రంగ ప్రవేశం చేసినా నిలదొక్కుకోవడం అనేది.. వారి ప్రతిభను బట్టి ఉంటుంది. తాజాగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ వారసురాలు అదితి శంకర్‌ కథానాయికిగా సినీ రంగ ప్రవేశం చేశారు. డాక్టర్‌ అయిన ఈమె యాక్టర్‌ కావడంపైనే ఆసక్తి చూపడం విశేషం. కార్తీ కథానాయకుడుగా నటించిన విరుమన్‌ చిత్రం ద్వారా ఈమె హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు.

తనను కథానాయికిగా పరిచయం చేసిన నటుడు సూర్య, జ్యోతిక, కార్తీకి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆడిషన్‌ నిర్వహించి తనను ఎంపిక చేసిన దర్శకుడు ముత్తైయ్యకు ధన్యవాదాలు చెప్పారు. తాను వైద్య విద్యను అభ్యసిస్తూనే సంగీతాన్ని నేర్చుకున్నానన్నారు. అయితే నటనపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉందన్నారు. ఆ కల విరుమాన్‌ చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తాను తేన్‌మొళిగా మధురై యువతి పాత్రలో నటించానన్నారు.

సిటీ యువతరైన తనను గ్రామీణ యువతీగా మార్చిన ఘనత దర్శకుడికే చెందుతుందన్నారు. చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్న తర్వాత తన తండ్రి శంకర్‌కు  తన నిర్ణయాన్ని చెప్పారన్నారు. ఇదిగా సక్సెస్‌ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడతానని చెప్పానన్నారు. దీంతో ఆయన అంగీకరించినట్లు వెల్లడించారు. నెంబర్‌ వన్‌ నటిగా రాణించిన నయనతార స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉందనేది తమ భావన అని, దాన్ని మీరు భర్తీ చేయగలరా..? అన్న ఒక విలేకరి ప్రశ్నకు కచ్చితంగా చేస్తానని అయితే అందుకు మీరు అంగీకరిస్తారా అని చిరునవ్వుతో ఎదురు ప్రశ్నించారు. అయితే తనకు అంకెల స్థానంపై నమ్మకం లేదని శ్రమను, అంకిత భావాన్ని నమ్ముకుని పని చేస్తానని అదితి శంకర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు